కృష్ణ.. అప్పటి నుంచే కుంగుబాటు

సూపర్ స్టార్ కృష్ణకు మొదటి భార్య ఇందిరాదేవి. ఆమెతో అయిదుగురు పిల్లల్ని కన్నారు కృష్ణ. వాళ్లే రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఐతే 1967లో సాక్షి సినిమా చేస్తుండగా.. విజయనిర్మలతో పరిచయం జరిగాక కృష్ణకు ఆమెతో సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ కలిసి ఏకంగా 40 సినిమాల్లో నటించడం విశేషం. పరిచయమైన కొంత కాలానికే తన మనసుకు బాగా దగ్గరైన విజయ నిర్మలను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

మొదటి భార్యకు ఏ లోటూ రాకుండా చూసుకుంటూ, పిల్లల ఎదుగుదలకు అన్ని రకాలుగా తోడ్పడుతూనే విజయ నిర్మలతో కలిసి సాగారు కృష్ణ. ఆమె కృష్ణ మొదటి భార్య పిల్లల విషయంలో ఏ రకంగానూ అడ్డంకి కాలేదు అంటారు. అప్పటికే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న విజయ నిర్మలకు కొడుకు నరేష్ ఉన్నాడు. కృష్ణ, విజయ నిర్మల కలిసి పిల్లల్ని కనలేదు.

కృష్ణకు సినిమాల పరంగానే కాక వ్యక్తిగతంగానూ పూర్తి సహకారం అందిస్తూ అన్నీ తానై నడిపించారు విజయనిర్మల. వీరిది ఎంత అన్యోన్య బంధం అన్నది చూసే జనాలకు స్పష్టంగా తెలిసేది. ప్రతి సందర్భంలోనూ కృష్ణకు ఆమె తోడుగా ఉండేవారు. విజయ నిర్మల ఉన్నన్నాళ్లూ కృష్ణ ఆరోగ్యంగా, చాలా హుషారుగానే కనిపించారు 70వ పడిలోకి వచ్చాక కూడా ఆయనలో ఉత్సాహం తగ్గలేదు. కానీ 2019లో విజయనిర్మల మరణించాక కృష్ణ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఐదు దశాబ్దాల పాటు తనకు తోడు నీడగా ఉన్న విజయ నిర్మల మరణంతో ఆయనలో ఒంటరి అయిపోయారు. మొదటి భార్య ఇందిరాదేవి అప్పటికే అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితం అయ్యారు. పిల్లలు, వారి పిల్లలు ఆయనకు ఏ లోటూ రాకుండా బాగానే చూసుకున్నా నిరంతరం తోడుగా ఉండే భార్య మరణం ఆయన్ని కుంగుబాటుకు గురి చేసిందన్నది సన్నిహితుల మాట. ఈ ఏడాది పెద్ద కొడుకు రమేష్ బాబు, మొదటి భార్య ఇందిరాదేవిలను కోల్పోవడం.. అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో తట్టుకోలేక తన జీవన ప్రయాణాన్ని ముగించేశారు.