తాప్సి సినిమా.. ఇండియాలో తొలిసారిగా

క‌రోనా దెబ్బ‌కు అల్లాడిపోతున్న రంగాల్లో సినీ ప‌రిశ్ర‌మ ఒక‌టి. ఫ‌స్ట్ కాపీతో రెడీ అయిన సినిమాలు విడుద‌ల‌కు నోచుకోవ‌ట్లేదు. నెల‌ల‌కు నెల‌లు వాటిని అలాగే పెట్ట‌డంతో వ‌డ్డీల భారంతో నిర్మాత‌ల న‌డ్డి విరిగిపోతోంది. అలాగే చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లో ఉన్న సినిమాల‌తో మ‌రో స‌మ‌స్య‌. డేట్లు వృథా అయిపోతున్నాయి. ఖ‌ర్చులు పెరిగిపోతున్నాయి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా షూటింగ్ చేయ‌డ‌మూ చాలా క‌ష్టంగా ఉంది. కాస్త ప‌రిస్థితులు మెరుగు ప‌డ్డాక షూటింగ్స్ చేద్దామ‌నుకుంటున్నారు కానీ.. అన్నీ సిద్ధం చేసుకుని ప‌ని మొద‌లుపెట్టాక మ‌ధ్య‌లో చిత్ర బృందంలో ఎవ‌రికైనా క‌రోనా వ‌స్తే ప‌రిస్థితి ఏంట‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఇలా అన్ని ర‌కాలుగా క‌రోనా ఇబ్బంది పెట్టేస్తోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందాలు క‌రోనా ఇన్సూరెన్స్ దిశ‌గా ఆలోచిస్తుండ‌టం విశేషం.

తాప్సి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న కొత్త సినిమా లూప్ ల‌పేటాకు క‌రోనా బీమా చేయిస్తున్న‌ట్లు తెలిసింది. ఇండియాలో ఈ ర‌క‌మైన బీమా చేయించుకున్న తొలి సినిమా ఇదేన‌ట‌. ఈ బీమా ఎలా వ‌ర్తిస్తుందో కూడా చిత్రబృందం వెల్ల‌డించింది. యూనిట్లో ఎవరికైనా కొవిడ్‌ 19 పాజిటివ్‌ వస్తే మిగిలిన అందరూ హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిందే. దాంతో చిత్రీకరణ వాయిదా పడుతుంది. కొవిడ్‌ బీమా చేయించడం వలన చిత్రీకరణ చేయలేని రోజులకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు అని చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన అతుల్ తెలిపాడు. ప్రస్తుతానికి ‘లూప్‌ లపేటా’ బీమాకు సంబంధించిన డ్రాప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే కొవిడ్‌ బీమా పొందిన తొలి చిత్రంగా ‘లూప్‌ లపేటా’ నిలుస్తుందంటున్నారు. తాప్సి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆకాశ్ భాటియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.