‘సింహాద్రి’కి ముందు అసలేం జరిగింది?

జూనియర్‌ను చాలా చిన్న వయసులోనే పెద్ద స్టార్‌ను చేసిన సినిమా ‘సింహాద్రి’. అప్పటికే ‘ఆది’తో తన స్టామినా చూపించిన తారక్.. ఈ చిత్రంతో రికార్డుల మోత మోగించి టాప్ స్టార్లకు పోటీగా నిలిచాడు.

అప్పటికి అత్యధిక కేంద్రాల్లో శత దినోత్సవ రికార్డును ‘సింహాద్రి’ బద్దలు కొట్టింది. ఏకంగా 151 కేంద్రాల్లో ఆ చిత్రం వంద రోజులు ఆడింది. ఈ చిత్రం విడుదలై గురువారంతో 17 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ట్వీట్లు వేస్తున్నారు. మిలియన్లలో ట్వీట్లు పడుతున్నాయి.

ఇక ‘సింహాద్రి’ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టించిందన్నది పక్కన పెడితే.. ఇది పట్టాలెక్కడానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ చిత్రాన్ని నిర్మించిన వీఎంసీ సంస్థ.. ఎన్టీఆర్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఆది’ మేకింగ్ దశలో ఉండగానే అతను హీరోగా పవన్స్ శ్రీధర్ అనే కొత్త దర్శకుడితో ఓ కాలేజ్ లవ్ స్టోరీని మొదలుపెట్టింది. ఆ చిత్రం సగం దాకా చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. ఐతే ఈ లోపు ‘ఆది’ రిలీజై బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాతో తారక్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. పెద్ద మాస్ హీరో అయిపోయాడు.

వీఎంసీ బేనర్లో తారక్ చేస్తున్న సినిమాలో అంతగా మాస్ అంశాలు లేకపోవడం, అది సగటు కాలేజీ లవ్ స్టోరీ కావడం అతడి ఇమేజ్‌కు ఈ సినిమా సరిపోదనిపించి దాన్ని మధ్యలో ఆపేశారు. అప్పుడే తారక్‌కు ‘స్టూడెంట్ నంబర్ వన్’తో తొలి విజయాన్నందించిన రాజమౌళి తెరపైకి వచ్చాడు.

అతను తన తండ్రితో ‘సింహాద్రి’ స్క్రిప్టు తయారు చేయించి.. తారక్‌తో వీఎంసీ బేనర్లో తెరకెక్కించడానికి ముందుకొచ్చాడు. తర్వాత ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలే ఉండగా.. ఆ అంచనాల్ని మించి ఎక్కడికో వెళ్లిపోయి భారీ విజయాన్నందుకుంది ‘సింహాద్రి’.