నెపోటిజం విమర్శలపై స్టార్ డాటర్ ఎదురు దాడి

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపోటిజం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. బాలీవుడ్లో బడా ఫ్యామిలీల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది సోషల్ మీడియాలో. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి వాళ్లపై గట్టిగా సోషల్ మీడియా దాడి జరిగింది. ఐతే చాలా వరకు వీళ్లందరూ ఈ సమయంలో సంయమనం పాటిస్తే మంచిదన్న ఉద్దేశంతో సైలెంటుగా ఉండిపోయారు. ఐతే ఎంతకీ ఈ దాడి ఆగకపోవడంతో స్టార్ కిడ్స్ ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. విమర్శల్ని కాచుకునే.. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సోనమ్ కపూర్.. నెపోటిజం విమర్శలకు బదులిచ్చే ప్రయత్నం చేయగా, ఇప్పుడు మహేష్ భట్ తనయురాలు, ఒకప్పటి కథానాయిక పూజా భట్ లైన్లోకి వచ్చింది.

భట్ కుటుంబం మీద వచ్చే నెపోటిజం విమర్శలు చూస్తే తనకు నవ్వు వస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. బాలీవుడ్లో అత్యధికంగా కొత్త వాళ్లకు, వర్ధమాన కళాకారులు, టెక్నీషియన్లకు అవకాశం కల్పించిన ఘనత భట్ సంస్థకే చెందుతుందని ఆమె అంది. పదుల సంఖ్యలో కొత్త వాళ్లను తమ సంస్థ పరిశ్రమకు పరిచయం చేసిందని ఆమె అంది. ఒక దశలో స్టార్లతో సినిమాలే చేయరని.. కొత్త వాళ్లకే అవకాశమిస్తూ పక్షపాతం చూపిస్తున్నారని తమ సంస్థ మీద విమర్శలు కూడా వచ్చాయని ఆమె గుర్తు చేసింది. ఇప్పుడు తమ కుటుంబంపై అదే పనిగా విమర్శలు చేస్తున్న కంగనా రనౌత్ గురించి కూడా పూజా స్పందించింది. ఇప్పుడిలా మాట్లాడుతున్న కంగనాను కూడా ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా ద్వారా తమ సంస్థే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిందని ఆమె చెప్పింది. కంగనా గొప్ప ప్రతిభావంతురాలని.. ఆమెను కనుగొన్నది దర్శకుడు అనురాగ్ బసునే అయినప్పటికీ.. తనను నమ్మి తొలి అవకాశం ఇచ్చామని.. ఇప్పుడామె అదే పనిగా తమను టార్గెట్ చేయడమేంటని పూజా ప్రశ్నించింది.