మళ్లీ అదరగొట్టిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు బుల్లితెరపై చెలరేగిపోతున్నాడు. అతడి చివరి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ మరోసారి టీవీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెకండ్ టెలికాస్ట్‌లో ఈ చిత్రానికి 17.4 టీఆర్పీ రావడం విశేషం. గత వీకెండ్లో ‘సరిలేరు..’ను రెండోసారి టెలికాస్ట్ చేసింది జెమిని టీవీ. ఈసారి కూడా ఈ చిత్రాన్ని టీవీ ప్రేక్షకులు విరగబడి చూశారని టీఆర్పీ రేటింగ్‌ను బట్టి స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి ఇంతకుముందే మార్చి చివరి వారంలో జెమినిలో తొలిసారిగా ప్రిమియర్‌గా వేయగా.. అప్పుడు రికార్డు స్థాయిలో 23.4 రేటింగ్ తెచ్చుకుంది. అది టాలీవుడ్ చరిత్రలోనే టాప్-3 రేటింగ్ కావడం విశేషం. దీని కంటే ముందు మహేష్ చేసిన ‘మహర్షి’ థియేటర్లలో బాగా ఆడినా.. టీవీలో డిజాస్టర్ అయింది. మహేష్ కెరీర్లోనే అత్యల్పంగా.. 10 లోపు రేటింగ్ తెచ్చుకుంది. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ను తొలిసారి ప్రసారం చేసినపుడు ఏమాత్రం రేటింగ్ వస్తుందో అని సందేహించారు.

ఐతే తొలి ప్రిమియర్లో ఈ చిత్రం ‘బాహుబలి’ని మించి రేటింగ్ తెచ్చుకుంది. అక్కినేని నాగార్జున సిినిమా ‘శ్రీరామదాసు’ 24 రేటింగ్‌తో అప్పట్లో రికార్డు నెలకొల్పింది. ‘టెంపర్’ 23.5 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. మార్చి ప్రిమియర్‌తో ‘సరిలేరు..’ మూడో స్థానాన్ని చేరుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కొత్త సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లోకి వస్తుండటంతో అక్కడ చాలామంది చూస్తున్నారు. ఆ తర్వాత టీవీల్లోకి వస్తుండటంతో రేటింగ్స్ బాగా పడిపోతున్నాయి.

ఐతే కరోనా పుణ్యమా అని థియేటర్లలో కొత్త సినిమాలు లేకపోవడం, జనాలు ఎక్కువగా ఇంటిపట్టున ఉంటుండటంతో ఇప్పుడు కొత్త చిత్రాలకు మంచి రేటింగ్ వస్తోంది. ఈ క్రమంలోనే ‘సరిలేరు..’ రికార్డు స్థాయి రేటింగ్ తెచ్చుకుంది. రెండో టెలికాస్ట్‌లో కూడా 17.4 రేటింగ్ రావడమంటే మాటలు కాదు. ఇది కూడా ఒక రికార్డు అయితే ఆశ్చర్యం లేదు.