మన నిర్మాతల్ని ఆపుతోందేంటి?

అక్షయ్ కుమార్ ఇప్పుడు ఇండియాలోనే సినిమాల ద్వారా అత్యధిక వార్షికాదాయం పొందుతున్న హీరో. అజయ్ దేవగణ్ ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ అందించిన సినిమాకు కథానాయకుడు. వీళ్లిద్దరి సినిమాలు ‘లక్ష్మీబాంబ్’, ‘బుజ్: ది ప్రైడ్ ఆఫ్’ ఇండియా.. త్వరలోనే డిస్నీ-హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కాబోతున్నాయి. గత నెలలో అమితాబ్ బచ్చన్-ఆయుష్మాన్ ఖురానాల ‘గులాబో సితాబో’ కూడా థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఈ కోవలో ‘లక్ష్మీబాంబ్’, ‘బుజ్’ సహా మరిన్ని పెద్ద సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. తమిళం, మలయాళంలోనూ పేరున్న సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో టాలీవుడ్ మాత్రం బాగా వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. అవసరానికి తగ్గట్లు స్పందించడంలో, ట్రెండ్‌ను అందిపుచ్చుకోవడంలో మనోళ్లు వెనుకంజలో ఉన్న సంగతి స్పష్టం.

రిలీజైనవన్నీ చిన్నవే..
ఇప్పటిదాకా తెలుగు నుంచి నేరుగా ఓటీటీల్లో రిలీజైన సినిమాలు నాలుగే., అందులో ‘అమృతారామమ్’ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది థియేటర్లలో రిలీజైనా ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఇక సత్యదేవ్ సినిమా ‘47 డేస్’ ఏఢాదికి పైగా విడుదల కోసం చూసి చూసి.. చివరికి ఇలా ఓటీటీ రిలీజ్‌తో మమ అనిపించేసింది. ఇక ‘భానుమతి రామకృష్ణ’ సినిమా చూస్తే.. అది ఓటీటీ కోసమే తయారైన వెబ్ సిరీస్‌లాగా అనిపించింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మాత్రమే అన్నింట్లోకి ప్రత్యేకంగా అనిపించే సినిమా. ఇది అనుకోకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే రెస్పాన్స్ ఎలా ఉండేదో చెప్పలేం. ప్రి రిలీజ్ బజ్ అయితే ఉండేది కాదు. దాని బడ్జెట్ కూడా చాలా తక్కువ కాబట్టి ఓటీటీలో బాగానే వర్కవుట్ చేశారు.

అవి రేసులో ఉన్నాయి కానీ..
ఐతే పై నాలుగు చిన్న సినిమాల్ని పక్కన పెడితే.. మీడియం రేంజ్ సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కావట్లేదు. లాక్ డౌన్‌ కంటే ముందు విడుదలకు సిద్ధమైన వి, ఉప్పెన, రెడ్ సినిమాలకు ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా సానుకూల స్పందన లేదు. వాళ్లు కోరుకున్న రేటు రాలేదా.. లేక హీరోలు వెనక్కి లాగారా.. లేక థియేటర్లలో రిలీజ్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుందనుకుంటున్నారా.. లేక తమ సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేయడమేంటి అనే ఆలోచన వాళ్లను వెనక్కి లాగుతోందా అన్నది తెలియట్లేదు. ‘ఉప్పెన’ మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం కాబట్టి అతణ్ని ఓటీటీ ద్వారా అరంగేట్రం చేయిస్తే బాగోదని ఆపుతున్నట్లున్నారు. నష్టాన్ని భరించడానికి కూడా సిద్ధమైనట్లున్నారు. మిగతా రెండు చిత్రాలకు వడ్డీల భారం మోయలేనంత అవుతున్నప్పటికీ నిర్మాతల్లో స్పందన లేదు. ఓటీటీల్లో రిలీజ్ చేస్తే ఆశించినంత లాభం రాదనుకుంటున్నారేమో కానీ.. ఇలా వడ్డీల భారమంతా లెక్కగట్టి, ప్రతికూల పరిస్థితుల్లో థియేటర్లలో రిలీజ్ చేసి ఆశించిన స్థాయిలో రాకుంటే అసలుకే మోసం వస్తుందేమో అన్న సందేహాలు కూడా ఉన్నాయి.

అలాంటి ఆఫర్లు లేవా?
మూణ్నెల్లు కాకపోతే ఆర్నెల్లు వేచి చూద్దాం అని ఇంతకుముందు అనుకున్నారేమో కానీ.. ఎప్పటికి థియేటర్లు తెరుచుకుంటాయో.. తెరుచుకున్నా మునుపటిలా రెవెన్యూ రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియట్లేదు. బాలీవుడ్ సినిమాలకు హాట్ స్టార్ వాళ్లు ఇచ్చినట్లు.. ప్రాంతీయ చిత్రాలకు అంతగా ఓటీటీలు ఆశించిన స్థాయిలో రేటు ఆఫర్ చేయట్లేదని.. ప్రాంతీయ చిత్రాల ద్వారా అంచనా వేసిన స్థాయిలో సబ్‌స్క్రిప్షన్లు పెరగట్లేదని అవి భావిస్తున్నాయని అంటున్నారు. ఇది కూడా మన నిర్మాతలు వెనుకంజ వేయడానికి కారణమేమో తెలియదు. మొత్తానికి బాలీవుడ్ మాదిరి మన దగ్గరా పెద్ద సినిమాలు ఓటీటీల్లో వస్తే చూడటానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నా.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.