పార‌సైట్ చూస్తూ నిద్ర‌పోయిన రాజమౌళి

పార‌సైట్.. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత చర్చ‌నీయాంశం అయిన సినిమా ఇదే. ఈ కొరియ‌న్ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసింది. ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డులు కూడా కొల్ల‌గొట్టింది. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డులు ఆ సినిమాకే ద‌క్క‌డం విశేషం. ఓ కొరియ‌న్ మూవీ ఆస్కార్ అవార్డుల్లో ఇలా స‌త్తా చాట‌డం న‌భూతో.

అప్ప‌టికే ఈ సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ఆద‌ర‌ణ ద‌క్క‌గా.. ఆస్కార్ అవార్డులు కొల్ల‌గొట్టాక ఇంకా ఎగ‌బడి చూశారు. అమేజాన్ ప్రైమ్‌లో గ‌త నెల చివ‌ర్లో రిలీజ్ చేయ‌గా.. అక్క‌డా కోట్ల మంది చూశారు. చూస్తున్నారు. హైప్‌కు త‌గ్గ‌ట్లు సినిమా లేద‌ని కొంద‌రు పెద‌వి విరిచినా.. మెజారిటీ ప్రేక్ష‌కులైతే ఈ సినిమా చూసి వావ్ అన్న‌వాళ్లే.

ఐతే మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళికి మాత్రం పార‌సైట్ సినిమా న‌చ్చ‌లేద‌ట‌. లాక్ డౌన్ టైంలో తాను చూసిన సినిమాల్లో పార‌సైట్ ఒక‌టని.. కానీ అది త‌న‌కు ఎక్క‌లేద‌ని అన్నాడు జ‌క్క‌న్న‌. సినిమా ఆరంభంలో కొంచెం నెమ్మ‌దిగా అనిపించింద‌ని.. మ‌ధ్య‌లోకి వ‌చ్చేసరికి తాను నిద్ర‌లోకి వెళ్లిపోయాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఈ సినిమాకు నాలుగు ఆస్కార్ అవార్డులిచ్చేంత సీన్ లేద‌ని.. హైప్‌కు త‌గ్గ‌ట్లు సినిమా లేద‌ని అన్న‌వాళ్లు ఉన్నారు కానీ.. రాజ‌మౌళి లాంటి సెల‌బ్రెటీ ఇలా సినిమా మ‌ధ్య‌లో నిద్ర‌పోయాన‌ని అన‌డం మాత్రం షాకింగే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లందుకుని ఆస్కార్లూ కొల్ల‌గొట్టిన సినిమా త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పి ఉండొచ్చు కానీ.. మ‌రీ నిద్ర‌పోయాన‌న‌డమే విడ్డూరం.