చిరంజీవికి హీరోయిన్‌ను తగిలిస్తున్నాడు!

ఓ రీమేక్ చేయాలంటే నేటివిటికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలి. ఆలెడ్రీ తెలుగులో డబ్ అయిన సినిమాను మళ్లీ రీమేక్ చేయాలంటే… ఏం చేయాలి? ఒరిజినల్ చూసినవారికి కూడా రీమేక్ కొత్తగా ఉందనిపించేలా స్క్రిప్టును మార్చేయాలి.

 ఇప్పుడు అదే పనిలో యమ బిజీగా ఉన్నాడట యంగ్ డైరెక్టర్ సుజిత్. మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’పై మనసు పడ్డ మెగాస్టార్ చిరంజీవి, ఎలాగైనా ఈ సినిమాను తెలుగులో చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ రీమేక్‌ను తెలుగులో తెరకెక్కించే బాధ్యత తీసుకున్న సుజిత్, ఒరిజినల్‌లో లేని కమర్షియల్ హంగులను కూరుస్తున్నాడట.

‘లూసిఫర్’ మలయాళంలో సూపర్ హిట్ అయినా కమర్షియల్ అంశాలు లేకుండా సాగడంతో మాస్ ఆడియెన్స్‌కు పెద్దగా నచ్చదు. కాని చిరూ సినిమా అంటే మినిమం ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటారు ఫ్యాన్స్. అదీగాక ఈ వయసులో కూడా డ్యాన్స్‌లు ఇరగదీస్తున్నారు మెగాస్టార్. అందుకే సినిమాకు వచ్చే ఫ్యాన్స్, ఏ మాత్రం ఫీల్ కాకుండా అన్ని ఎలిమెంట్స్ ‘లూసిఫర్’ రీమేక్‌లో కనిపించబోతున్నాయి.

ఒరిజినల్ మూవీలో మోహన్‌లాల్‌కు హీరోయిన్ ఉండదు. డూయెట్స్ కూడా ఉండవు. అయితే తెలుగులో మాత్రం చిరూ కోసం ఓ హీరోయిన్‌ను కూడా ఎంపిక చేస్తున్నారట. డ్యూయెట్స్, కామెడీ సీన్స్, ఐటెమ్ సాంగ్స్… ఇలా అన్నీ తెలుగు ‘లూసిఫర్’లో ఉంటాయన్నమాట. మూలకథను మాత్రం తీసుకుని, స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చేసి ఆసక్తికరంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడట సుజిత్.

అయితే తమిళ్ ‘కత్తి’లో లేని మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి, ‘ఖైదీ నెం.150’ గా రీమేక్ చేశాడు వినాయక్. ఆ సినిమా మాస్ ఆడియెన్స్‌ను మెప్పించినా, ఒరిజినల్‌లో ఉన్న ఫీల్‌ మాత్రం మిస్ అయ్యింది. తెలుగులో జత చేసిన బ్రహ్మనందం పాత్ర, ఆలీ కామెడీ, మందు కొట్టే సీన్స్ చూసి మురగదాస్ తెగ ఫీల్ అయ్యాడు కూడా. ‘లూసిఫర్’ రీమేక్‌ విషయంలో అలా కాకుండా జాగ్రత్త పడితే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్.