ప్రేక్షకుల మూడ్ మార్చేది ఎవరో?


కొవిడ్ తర్వాత సినిమాల పరిస్థితి ఎలా ప్రమాదకరంగా మారిందో చూస్తూనే ఉన్నాం. అలా అని ఏ సినిమా ఆడట్లేదా.. ప్రేక్షకులు థియేటర్లకే రావట్లేదా అంటే అదేమీ లేదు. గత ఏడాది కొవిడ్ బ్రేక్ తర్వాత వచ్చిన కాస్త పేరున్న సినిమా అయిన ‘లవ్ స్టోరి’ డివైడ్ టాక్‌తోనూ భారీ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత అఖండ, పుష్ప చిత్రాలు ఎలా ఆడాయో అందరికీ తెలిసిందే. ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ సినిమాలకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇక వేసవిలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 ఎలా ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే.

చివరగా ఒకే రోజు రిలీజైన ‘మేజర్’, ‘విక్రమ్’ చిత్రాలకూ అంచనాలకు మించే కలెక్షన్లు వచ్చాయి. కాబట్టి అసలు ప్రేక్షకులు థియేటర్లకే రారేమో అనుకోవాల్సిన పని లేదు. వాళ్లను ఎగ్జైట్ చేసే సినిమా రావాలి. దానికి టికెట్ల రేట్లు మరీ ఎక్కువ కాకుండా అందుబాటులో ఉండేలా చూడాలి. అలాంటి సినిమా ఒకటి పడితే మళ్లీ ప్రేక్షకుల మూడ్ మారి థియేటర్ల వైపు కదులుతారు.

జూన్ తొలి వారం తర్వాత ప్రతి వీకెండ్లోనూ ఒక కొత్త సినిమా మీద ఆశలు పెట్టుకోవడం.. అది నిరాశ పరచడం మామూలపోయింది. జులైలో పక్కా కమర్షియల్, ది వారియర్, థాంక్యూ చిత్రాలు అంచనాలు రేకెత్తించాయి. కచ్చితంగా పరిస్థితిని మారుస్తాయిన అనిపించాయి. కానీ చివరికి చూస్తే అవి కంటెంట్‌ పరంగా మరీ వీక్ సినిమాలు కావడంతో నిరాశ తప్పలేదు. ఇప్పుడిక మాస్ రాజా రవితేజ సినిమా ‘రామారావు: ఆన్ డ్యూటీ’ మీదికి అందరి దృష్టి మళ్లుతోంది. మాస్ రాజా సినిమా అంటే వీకెండ్లో బాగానే సందడి ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ గట్టిగానే ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రానికి హైప్ కొంచెం తక్కువే ఉంది.

‘రామారావు’ రవితేజ మార్కు మసాలా మూవీలా లేకపోవడం, అలాగే బాక్సాఫీస్ పరిస్థితులు బాలేకపోవడం, వర్షాల వల్ల దీనిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కానీ సినిమాకు మంచి టాక్ వచ్చి, అప్పటికి వర్షాల దెబ్బ లేకుంటే పరిస్థితి మారొచ్చు. ఇది మిస్ అయితే ఆగస్టు 5కు రానున్న సీతారామం, బింబిసార ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. ఆ తర్వాతి వారానికి షెడ్యూల్ అయిన కార్తికేయ-2, మాచర్ల నియోజకవర్గం కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి ఈ చిత్రాల్లో ప్రేక్షకుల మూడ్ మార్చి మళ్లీ బాక్సాఫీస్‌ల సందడి తెచ్చే సినిమా ఏదవుతుందో?