డిస్నీ చేతికి రామోజీ ఫిలిం సిటీ?

తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే ఒక డీల్‌కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. టాలీవుడ్లో మెజారిటీ సినిమాల షూటింగ్‌లకు కేంద్రంగా ఉంటున్న రామోజీ ఫిలిం సిటీని ప్రముఖ హాలీవుడ్ స్టూడియో డిస్నీ మూడేళ్ల కాలానికి లీజుకు తీసుకున్నట్లు సంచలన వార్తలు బయటికి వస్తున్నాయి. ఆసియాలో అతి పెద్ద మూవీ మార్కెట్లలో ఒకటైైన ఇండియాపై డిస్నీ ఈ మధ్య సీరియస్‌గానే దృష్టిసారించింది.

ఈ క్రమంలోనే హాట్ స్టార్ వాళ్లతో టై అప్ అయింది. వివిధ భారతీయ భాషల్లో కొన్నేళ్లుగా సినిమాలు కూడా నిర్మిస్తోంది. ఇప్పుడు హాట్ స్టార్‌తో కలిసి ఇండియన్ మార్కెట్ లక్ష్యంగా ఒరిజినల్స్ తీయాలనుకుంటోంది. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీని వేదికగా చేసుకోవాలని ఆ సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ వేల కోట్లలోనే ఉండొచ్చని అంటున్నారు.

1600 ఎకరాలతో ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో రికార్డు సృష్టించిన ఘనత రామోజీ ఫిలిం సిటీది. ఇక్కడ తెలుగు సినిమాలే కాదు.. హిందీ, తమిళం సహా పలు భాషల చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘బాహుబలి’లో మెజారిటీ చిత్రీకరణ ఇక్కడ నిర్మించిన సెట్టింగ్స్‌లోనే జరుపుకుంది. ఇంకా మరెన్నో భారీ చిత్రాల షూటింగ్ ఇక్కడ జరిగింది. ఐతే దీని నిర్వహణ కొంచెం భారంగా మారడం, లాక్‌డౌన్‌లో ఆదాయం లేకపోగా, మెయింటైనెన్స్‌కు భారీగా ఖర్చు కావడంతో రామోజీ గ్రూప్ బాగా ఇబ్బంది పడింది. వాళ్ల వేరే వ్యాపారాలు కూడా బాగా దెబ్బ తిన్నాయి.

ఇలాంటి సమయంలో డిస్నీ నుంచి ఆఫర్ రావడంతో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పుడు ఇబ్బంది ఉన్నా.. దేశవ్యాప్తంగా షూటింగ్స్ పున:ప్రారంభమై ఊపందుకుంటే ఫిలిం సిటీకి మాంచి డిమాండే ఉండొచ్చు. భారీగా ఆదాయం రావచ్చు. అయినా సరే.. పెద్ద మొత్తంలో ఒకేసారి ఆదాయం తీసుకుని ప్రశాంతంగా ఉందామని రామోజీ ఫ్యామిలీ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ డీల్ నిజమే అయితే.. ఫిలిం సిటీ కేంద్రంగా పని చేసే ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌కు సంబంధించిన వేల మంది ఉద్యోగుల సంగతేంటన్నది ప్రశ్నార్థకం. అలాగే ఫిలిం సిటీ కోసం ఉద్యోగుల పరిస్థితేంటో కూడా చూడాలి.