సుశాంత్‌ను వేదనకు గురి చేసిన ఆ రెండు సినిమాలు

Drive

నటుడిగా మంచి గుర్తింపు సాధించి, స్టార్ ఇమేజ్ కూడా సాధించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడటం కోట్లాది మందిని షాక్‌కు గురి చేసింది. అతణ్ని అంతగా వేధిస్తున్న సమస్యలేంటన్న ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. వ్యక్తిగత సమస్యలకు తోడు.. సినిమాల సంబంధిత ఇబ్బందులు కూడా అతను ఎదుర్కొంటూ ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కువగా వారసులతో నిండిపోయిన బాలీవుడ్‌లో సుశాంత్ ఒంటరివాడైపోయాడని.. అతణ్ని తోటి నటీనటులు, టెక్నీషియన్లు ఆదరించట్లేదని.. అందరూ కలిసి అతడి శోకాన్ని పెంచారని అంటున్నారు. రెండు సినిమాల విషయంలో అతను ఎంతో వేదన ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. అందులో ఒకటి శేఖర్ కపూర్ డైరెక్ట్ చేయాల్సి ఉండి ఆగిపోయిన ‘పానీ’ కాగా.. ఇంకోటి కొన్ని నెలల కిందటే డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ‘డ్రైవ్’.

హాలీవుడ్లోనూ మంచి పేరు సంపాదించిన శేఖర్ కపూర్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా యశ్ రాజ్ ఫిిలిమ్స్ ‘పానీ’ సినిమాను నిర్మించాలని కొన్నేళ్ల కిందటే సన్నాహాలు చేసింది. దీని కోసం సుశాంతో ఎంతో కష్టపడి సిద్ధమయ్యాడు కూడా. కానీ అనివార్య కారణాలతో అది ఆగిపోయింది. దీంతో సుశాంత్ ఎంతో ఆవేదన చెందాడని శేఖర్ ఇప్పుడు స్వయంగా చెప్పడం గమనార్హం.

మరోవైపు ‘డ్రైవ్’ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలని సుశాంత్ ఆశించగా.. నిర్మాత కరణ్ జోహార్ అతడి విన్నపాన్ని పట్టించుకోకుండా ఓటీటీలో (లాక్ డౌన్ కంటే ముందే) రిలీజ్ చేసేశాడు. ఇది అతణ్ని బాధించినట్లు చెబుతున్నారు. సుశాంత్ మృతి నేపథ్యంలో శేఖర్ కపూర్ చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే సినీ రంగంలో అతడికి చేదు అనుభవాలున్నాయని స్పష్టమవుతోంది.

‘‘సుశాంత్.. నువ్వు పడ్డ ఆవేదన నాకు తెలుసు. నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు తెలుసు. నువ్వు బాధపడుతూ నా భుజాలపై పడి కన్నీరు పెట్టుకున్నావు. గత ఆరు నెలలు నేను నీ దగ్గర ఉండుంటే బాగుండేది. నువ్వు నన్ను కలిసుంటే బాగుండేది. నీకు ఇలా జరగడం వాళ్ల కర్మ. నీది కాదు’’ అంటూ శేఖర్ చేసిన ట్వీట్ అనుమానాల్ని పెంచేదే.