శ్రీదేవి కూతురి సినిమా.. థియేటర్లలో లేదు

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేదు. ఇప్పుడందరి దృష్టీ ఓటీటీల మీదే ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. తెరుచుకున్నా ఆక్యుపెన్సీ చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. ఒకప్పట్లా థియేటర్లు నడవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో చిన్న, మీడియం రేంజి సినిమాల దృష్టి ఓటీటీల మీదే పడింది. లాభాలు తగ్గించుకుని అయినా నేరుగా డిజిటల్ రిలీజ్‌కు ఒప్పేసుకుంటున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ కొంచెం వెనుకంజ వేస్తోంది కానీ.. మిగతా ఇండస్ట్రీలు చురుగ్గానే ఉన్నాయి. హిందీలో వరుసగా సినిమాలు ఓటీటీల్లోకి దూకేయబోతున్నాయి. ఇంకో మూడు రోజుల్లోనే అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాల ‘గులాబో సితాబో’ అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నవాజుద్దీన్ సిద్ధిఖి సినిమా ‘గూమ్ ఖేతు’ కూడా ఇలాగే రిలీజైన సంగతీ తెలిసిందే.

విద్యాబాలన్ మూవీ ‘శకుంతలా దేవి’ కూడా త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది. ఇంతలో మరో ఆసక్తికర మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌ జాబితాలో చేరింది. అదే.. గుంజన్ సక్సేనా. ఇది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం. 2018లో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ధఢక్’తో కథానాయికగా పరిచయమైన జాన్వి.. రెండో సినిమాకే ఓ ఛాలెంజింగ్ రోల్ ఎంచుకుంది. ఆమె కార్గిల్ యుద్ధంలో మహిళా పైలట్‌గా వీరోచిత పాత్ర పోషించిన గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తుంది. ‘గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శరణ్ శర్మ రూపొందించాడు. కరణ్ జోహార్ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’తో కలిసి జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం డైరెక్ట్‌గా నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. మరి శ్రీదేవి కూతురి సినిమాకు ఆన్‌లైన్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.