చిరంజీవి స‌ర్జా అంత్య‌క్రియ‌ల‌పై వివాదం

సౌత్ ఇండియన్ సీనియ‌ర్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జా ఆదివారం గుండెపోటుతో హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం క‌ర్ణాట‌క వాసుల్ని షాక్‌కు గురి చేసింది. శ‌నివారం రాత్రి కూడా సోష‌ల్ మీడియాలో త‌న త‌మ్ముళ్ల‌తో కలిసి దిగిన హుషారైన ఫొటో షేర్ చేసుకున్న చిరంజీవి.. ఇలా హ‌ఠాత్తుగా చ‌నిపోవ‌డం ఊహించ‌నిది. అత‌డి వ‌య‌సు 39 ఏళ్లే. ఏ అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా లేవంటున్నారు. న‌టి మేఘ‌నారాజ్‌తో ప‌దేళ్లు ప్రేమ‌లో ఉండి రెండేళ్ల కింద‌టే పెళ్లి చేసుకున్న చిరంజీవి.. ఆమె గ‌ర్భ‌వ‌తిగా ఉండ‌గా ఇలా చ‌నిపోవ‌డం అంద‌రినీ కల‌చి వేస్తోంది.

చిరంజీవి అంత్య‌క్రియ‌ల తాలూకు దృశ్యాలు కూడా అంద‌రికీ కంట‌త‌డి పెట్టిస్తున్నాయి. హీరోనే అయిన చిరంజీవి త‌మ్ముడు ధ్రువ్‌.. క‌న్నీటిని ఆపుకుంటూ అన్న‌య్య పాడె మోస్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అలాగే త‌న మేన‌ల్లుడి పార్థివ దేహాన్ని చూసి అర్జున్ ఏడుస్తున్న దృశ్యాలు.. భ‌ర్త మృత‌దేహాన్ని చివ‌రిసారిగా చూసుకుని అత‌ణ్ని హ‌త్తుకుంటూ, ముద్దాడుతూ మేఘ‌న క‌న్నీరు మున్నీర‌వుతున్న దృశ్యాలు కూడా గుండెలు పిండేస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా.. సోమ‌వారం జ‌రిగిన‌ చిరంజీవి అంత్య‌క్రియ‌ల విష‌య‌మై నేష‌న‌ల్ మీడియాలో నెగెటివ్ స్టోరీలు ప్ర‌సార‌మ‌వుతున్నాయి. లాక్ డౌన్ వేళ అంత్య‌క్రియ‌ల్లో 20 మందికి మించి పాల్గొన‌కూడ‌ద‌న్న‌ది కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశం. ఐతే చిరంజీవి అంత్య‌క్రియ‌ల విష‌యంలో అలాంటి ష‌ర‌తులేమీ పాటించ‌లేదు. దాదాపు 500 మంది అంత్య‌క్రియ‌ట్లో పాల్గొన్నారు. చిరంజీవి ఇంటి ద‌గ్గ‌ర‌.. శ్మ‌శాన‌వాటిక‌లో పెద్ద ఎత్తున జ‌నం గుమిగూడారు. చిరంజీవి కుటుంబం ఎంత విషాదంలో ఉన్న‌ప్ప‌టికీ.. భౌతిక దూరం, ఇత‌ర నిబంధ‌న‌ల‌న్నీ ప‌క్క‌న పెట్టేయ‌డాన్ని నేష‌నల్ మీడియా ఆక్షేపిస్తోంది. రిషి క‌పూర్, ఇర్ఫాన్ ఖాన్ చ‌నిపోయిన‌పుడు బాలీవుడ్ వాళ్లు ఎంత స్ట్రిక్టుగా ఉన్నారో చెబుతూ.. చిరంజీవి అంత్య‌క్రియ‌ట‌ విష‌యంలో నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.