రాధేశ్యామ్.. అందుకే లేటంట

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో రాధేశ్యామ్ ఒకటి. ‘సాహో’లాంటి భారీ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ తర్వాత ప్రభాస్‌ ఎంచుకున్న కూల్ లవ్‌స్టోరీ ఇది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదీ కూల్‌గా సాగట్లేదు. ముఖ్యంగా యేళ్లకేళ్లు ఈ సినిమాని తీయడం ఫ్యాన్స్‌ని చాలా డిజప్పాయింట్ చేసింది. ఎట్టకేలకి ఈ సంక్రాంతికి ముహూర్తం పెట్టారు. అయినా కూడా ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంత హ్యాపీగా కనిపించట్లేదు. దానికి కారణం ప్రమోషన్స్‌పై శ్రద్ధ పెట్టకపోవడం.

త్వరలో రిలీజ్ కానున్న సినిమాలన్నీ ఓ రేంజ్‌లో ప్రమోషన్ చేసుకుంటున్నాయి. అస్తమానం ఏదో ఒక అప్‌డేట్ వదులుతూనే ఉన్నాయి. దాంతో వాటిపై టాక్ బాగా నడుస్తోంది. కానీ రాధేశ్యామ్ మేకర్స్‌ మాత్రం ఎప్పుడైనా ఓ అప్‌డేట్ ఇస్తున్నారు. ఆ తర్వాత కామ్ అయిపోతున్నారు. నెక్స్ట్ అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాలి. లేదా ఏ అభిమానో నిర్మాతల మీద ఫైర్ అవ్వాలి. దాంతో టీమ్ తీరు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని చాలా డిస్టర్బ్ చేస్తోంది. పైగా ఈ సినిమా పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయనే విషయం తెలిసి చెప్పిన టైమ్‌కి వస్తారా మళ్లీ వాయిదా వేస్తారా అంటూ వాళ్లు తెగ టెన్షన్ పడుతున్నారు.

అయితే ఈ ఆలస్యానికి యూనిట్‌లోని కొందరు చెబుతున్న కారణం వేరే ఉంది. ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీలోని పాటల్ని ఒక్కో భాషలో ఒక్కోలా ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేశారట. వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్స్‌ని తీసుకున్నది కూడా అందుకేనట. లొకేషన్లు, ఆర్టిస్టుల దగ్గర్నుంచి ఏ భాషకి తగ్గట్టు ఆ భాషలో తీస్తున్నారట. ఇలా సెపరేట్ సెపరేట్‌గా రెడీ చేస్తూ ఉండటం వల్లే ఎక్కువ టైమ్‌ తీసుకుంటోందని, సినిమా ఇంత ఆలస్యమవడానికి, అప్‌డేట్స్ లేటవ్వడానికి కారణం కూడా అదేనని వాళ్లు చెబుతున్నారు.

కానీ ఈ జవాబు కూడా అభిమానులకు రుచించడం లేదు. ప్యాన్ ఇండియా సినిమా రావడం ఇదే మొదటిసారి కాదు. మరి వీళ్లెందుకు ఇలా సెపరేట్‌గా ప్రెజెంటేషన్ ఇచ్చుకోవడం, అంత సమయం, డబ్బు వృథా చేసుకోవడం అనేది కొందరి కామెంట్. ఒకవేళ ఈ విషయం నిజమే అయ్యి టైమ్‌ పట్టినా.. మరీ ఇలా యేళ్లకేళ్లు పడుతుందా అనేది మరో ప్రశ్న. అసలు షూటింగ్ పూర్తయ్యిందా, చెప్పినట్టుగా పొంగల్‌కి మూవీ బరిలోకి దిగుతుందా అనేది అన్నిటికంటే పెద్ద ప్రశ్న. ఇలా అప్‌డేట్స్ లేకపోవడం, అనుమానాలు పెరగడం వల్ల జరుగుతున్న చెడుని మేకర్స్ గుర్తించట్లేదు. అంతకంతకీ ప్రేక్షకులకి సినిమాపై ఇంటరెస్ట్‌ తగ్గుతోంది. వచ్చిన అప్‌డేట్స్ కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమా కూడా అలానే ఉంటుందేమో అనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఆ సంగతిని ఇప్పటికైనా గుర్తించి టీమ్ అలర్ట్ అయితే మంచిది. లేదంటే రాధేశ్యామ్ కష్టాల్లో పడే అవకాశం ఉందనిపిస్తోంది.