ఆర్ఆర్ఆర్’కు పునాది పడ్డ ఆ రోజు..

‘బాహుబలి’తో ఎవ్వరూ ఊహించని బ్లాక్‌బస్టర్ డెలివర్ చేశాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. అంతకుముందే మగధీర, ఈగ లాంటి అసాధారణ ప్రయత్నాలు చేసినా.. అవి తెలుగు రాష్ట్రాలను దాటి మిగతా ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేదు. కానీ ‘బాహుబలి’తో జక్కన్న ప్రభ ప్రపంచ స్థాయికి విస్తరించింది. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని భారీ విజయాన్నందుకుంది. దీని తర్వాత రాజమౌళి చేసే సినిమా మీద అమితాసక్తి నెలకొంది. ఈ సినిమా విషయంలో రకరకాల ఊహాగానాలు కూడా నడిచాయి. చివరికి ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలైన ఆరు నెలల తర్వాత 2017 నవంబరు 18న రాత్రి 10 గంటల ప్రాంతంలో రాజమౌళి ఈ సస్పెన్సుకు తెరదించాడు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల సంచలన కాంబినేషన్లో రాజమౌళి తన తర్వాతి చిత్రాన్ని తీయబోతున్నాడన్న సమాచారం బయటికి వచ్చింది ఆ డేట్‌కే. ఆ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో జక్కన్న తన ట్విట్టర్ అకౌంట్లో తారక్, చరణ్‌లతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అంతకుమించి ఏ వ్యాఖ్యా జత చేయలేదు. ముందు ఇదేదో మామూలు ఫొటోనే అనుకున్నారు కానీ.. ఈ కలయికలో ఒక మెగా మల్టీస్టారర్‌ను జక్కన్న తీయబోతున్నాడని తర్వాతే జనాలకు అర్థమైంది. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఒక చరిత్ర.

కాంబినేషన్ పరంగా మాత్రమే క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా.. గత నాలుగేళ్లలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి ‘బాహుబలి’కి దీటైన క్రేజ్ సంపాదంచుకుంది. బిజినెస్ పరంగా కూడా దాన్ని మించేసింది. ఇంకో 50 రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ కాంబినేషన్ గురించి హింట్ ఇస్తూ తాను షేర్ చేసిన తొలి ఫొటోను రాజమౌళి రీట్వీట్ చేశాడు. ఇది చూసి ఈ నాలుగేళ్ల జర్నీ మొత్తం ప్రేక్షకులకు గుర్తుకు వస్తోంది.