చిరు చొరవ.. సినీ కార్మికులకు వరం

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఉన్నంత కాలం తన ఇమేజ్‌ను దెబ్బ తీసుకోవడమే తప్ప.. పెద్దగా సాధించిందేమీ లేదు. ఎన్నికల సమయంలో టికెట్లు అమ్ముకున్నారన్న ప్రచారంతో మొదలుపెడితే.. ఎన్నికల్లో ఓటమి తర్వాత రెండేళ్లు తిరక్కుండానే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. అందుకు ప్రతిగా మంత్రి పదవి పొందడం.. ఇలాంటి కారణాలతో ఆయన ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది తన కెరీర్లోనే ఎన్నడూ లేనంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారాయన.

ఐతే ఒక దశ దాటాక ఆయనకు రాజకీయాల మీద విరక్తి పుట్టింది. పొలిటికల్ లీడర్‌గా తనకు వచ్చిన నెగెటివ్ ఇమేజ్‌ను ఆయన తట్టుకోలేకపోయారు. సినిమా హీరోగా ఉండటానికే ఇష్టపడ్డారు. పోయిన తన ఇమేజ్‌ను తిరిగి తెచ్చుకోవడానికి, జనాల్లో మళ్లీ మంచి పేరు సంపాదించడానికి ఆయన చాలానే కష్టపడ్డారు.

గత కొన్నేళ్లలో చిరు ఎన్ని మంచి పనులు చేశారో.. ఎంత ఉదారంగా వ్యవహరించారో.. సేవా కార్యక్రమాల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అందరికీ తెలిసిందే. అనధికార సినీ పెద్దగా ఆయన ఎవరికి ఏ సాయం కావాలన్నా ముందుకొచ్చి అండగా నిలిచారు. ముఖ్యంగా కరోనా టైంలో చిరు చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవలి ‘మా’ ఎన్నికల సందర్భంగా తలెత్తిన పరిణామాలతో కొంత కినుక వహించి కొన్ని రోజులు మాత్రం ఆయన సైలెంటుగా ఉండిపోయారు.

కానీ ఈ మధ్య మళ్లీ బయటికొచ్చి పరిశ్రమ కోసం గళం విప్పుతున్నారు. తనకు చేతనైనంత సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో యోధ అనే డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి చిరు హాజరయ్యారు. ఇందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం పాల్గొన్నారు. చాలా పెద్ద స్థాయిలోనే డయాగ్నోస్టిక్ సెంటర్స్ చైన్ మొదలుపెడుతోందీ సంస్థ.

ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ సినీ కార్మికులకు ఈ సంస్థ తరఫున తోడ్పాటు కోసం విన్నవించారు. చిరు అంతటి వాడు అలా అడగడంతో సంస్థ అధినేత వెంటనే మైక్ దగ్గరికి వచ్చేశారు. అప్పుడు చిరు మొహమాట పడుతూనే మిమ్మల్ని ఇలా బలవంతంగా కమిట్ చేయించేయట్లేదు కదా అన్నారు. దానికి సంస్థ అధినేత అలాంటిదేమీ లేదంటూ చిరు నవ్వు నవ్వారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులక కాక.. 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులందరికీ తమ డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో అన్ని పరీక్షలూ 50 శాతం రాయితీతో చేస్తామని హామీ ఇవ్వడం విశేషం. ప్రమోషన్ కోసం ఇలా చెప్పి ఉంటే చెప్పి ఉండొచ్చు కానీ.. ఇది కచ్చితంగా సినీ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఈ వీడియోను సినీ జనాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరును కొనియాడుతున్నారు.