ఆ రూల్ పక్కన పెట్టేసిన శ్రుతి హాసన్

ఒక క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఎట్టకేలకు మొదలైంది. ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న కొత్త చిత్రానికి శనివారమే ముహూర్త వేడుక జరిగింది. ఈ ప్రాజెక్టు ఖరారై చాలా కాలమైంది కానీ.. రకరకాల కారణాల వల్ల సినిమా మొదలవడానికి టైం పట్టేసింది. ఈ చిత్రానికి కథానాయికగా శ్రుతి హాసన్ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ రోజు ముహూర్త వేడుకలో ఆమె కూడా పాల్గొంది.

బాలయ్యతో కలిసి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది. కానీ ఈ జోడీనిలా చూడటం కొంచెం కొత్తగానే అనిపిస్తోంది అందరికీ. ఎందుకంటే శ్రుతి హాసన్ ఇప్పటిదాకా బాలయ్య తరం సీనియర్ హీరోలు ఎవ్వరితోనూ ఇప్పటిదాకా రొమాన్స్ చేయలేదు. ఈ విషయంలో ఆమె తనకు తాను ఒక రూల్ పెట్టుకున్నట్లు చెబుతారు సన్నిహితులు.

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురూ కమల్ హాసన్ తరం హీరోలు. వీళ్లతోనే కాక తమిళంలోనూ కమల్ తరం హీరోలెవ్వరితోనూ శ్రుతి కలిసి నటించలేదు. తండ్రి తరం హీరోలతో రొమాన్స్ చేయడం బాగోదని ఆమె ఇప్పటిదాకా వాళ్లెవ్వరితోనూ సినిమాలు చేసినట్లు లేదు.

వీరి తర్వాతి తరం సీనియర్ హీరోలైన పవన్ కళ్యాణ్, రవితేజ, సూర్య లాంటి స్టార్లతో మాత్రమే జత కట్టింది. యంగ్ హీరోలు చాలామందితో ఆడిపాడింది. ఐతే మధ్యలో కొన్నేళ్లు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని ఏడాది నుంచి మళ్లీ బిజీ అవుతున్న శ్రుతి ఇప్పుడు తన వద్దకు ఏ అవకాశం వచ్చినా విడిచిపెట్టట్లేదు.

శ్రుతి కథానాయికగా గోపీచంద్‌ చేసిన బలుపు, క్రాక్ బ్లాక్‌బస్టర్ హిట్లు అయ్యేసరికి ఆమె అతడికి లక్కీ ఛార్మ్‌గా మారిపోయింది. దీంతో బాలయ్య సినిమాకు కూడా ఆమెనే అడిగాడు. శ్రుతి కాదనలేకపోయింది. తండ్రి తరం సీనియర్లతో రొమాన్స్ చేయకూడదన్న రూల్ పక్కన పెట్టేసి బాలయ్యతో ఆమె జట్టు కట్టబోతోంది. కాబట్టి ఇక చిరు, నాగ్, వెంకీలకు జోడీగా అడిగినా శ్రుతి కాదనకపోవచ్చు.