ఏ గ్రౌండ్స్ లో పట్టాభికి హైకోర్టు మంజూరు చేసింది?

గడిచిన మూడు నాలుగు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయిన రాజకీయ రగడకు సెంటర్ గా మారారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య చేసిన ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాత్రి వేళ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ ఆయన్ను అరెస్టు చేయటం.. తాజాగా ఆయన రాజమహేంద్రవరం జైలుకు తరలించటం తెలిసిందే. దీంతో.. పట్టాభికి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా పట్టాభి తరఫు లాయర్ కీలకమైన పాయింట్ ను తెర మీదకు తేవటంతో శుక్రవారం జరిగిన విచారణను శనివారానికి వాయిదా వేశారు. తాజాగా పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇంతకూ పట్టాభికి అంత త్వరగా బెయిల్ ఎందుకు వచ్చింది?

దానికి కారణం ఏమిటి? అన్న విషయాల్ని చూస్తే.. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సందర్భంగా పోలీసులు కొన్ని చోట్ల ఖాళీలు ఉంచేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని సేకరించి అందులో నమోదు చేయాలని కింది కోర్టు పేర్కొంటూ.. ఆయన్ను రిమాండ్ కు ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై అప్పీలుకు వెళ్లిన పట్టాభి లాయర్.. ఇదే విషయాన్ని ప్రశ్నించటం.. సంశయాలు ఉన్నప్పుడు రిమాండ్ కు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించటం.. దానికి సంబంధించిన వివరాల్ని ఇవ్వాలని పీపీని ఆదేశించటం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో.. పట్టాభి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికి ఆయనకు ఇచ్చిన నోటీసుల్లో ఉన్న ఖాళీల ఆధారంగానే బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. పట్టాభి కి బెయిల్ రావటంపై టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.