తెలుగులో ఎవరో కానీ.. తమిళంలో మాత్రం సూర్య, కార్తి

తెలుగులో ఈ మధ్య ఒక క్రేజీ రీమేక్ గురించి చర్చ నడుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుం కోషియుం’ చిత్రాన్ని తెలుగులో తీసేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ హక్కులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఇద్దరు కథానాయకుల పాత్రల కోసం రకరకాల పేర్లు వినిపించాయి. పృథ్వీరాజ్ పాత్రకు రానా దగ్గుబాటి, బిజు మీనన్ క్యారెక్టర్‌కు నందమూరి బాలకృష్ణల పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇప్పటిదాకా అయితే నటీనటుల సంగతి ఏమీ తేలినట్లు లేదు.

ఈ రీమేక్‌కు దర్శకుడెవరన్న దానిపైనా స్పష్టత లేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు రచయితల బృందంతో స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసే పని నడుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే తెలుగు రీమేక్ సంగతేమో కానీ.. తమిళంలో మాత్రం ఈ సినిమాలో హీరోలెవరన్నది ఖరారైపోయినట్లు సమాచారం.

‘అయ్యప్పనుం కోషియుం’ తమిళ రీమేక్ హక్కుల్ని అగ్ర కథానాయకుడు సూర్య సొంతం చేసుకున్నాడట. తన 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. ఇందులో సూర్యతో పాటు కార్తి నటించనున్నారట. కార్తి పృథ్వీరాజ్ పాత్రలో నటించనుండగా.. సూర్య బిజు క్యారెక్టర్లో కనిపించనున్నాడట.

వాళ్లిద్దరికీ ఆ పాత్రలు పర్ఫెక్ట్‌గా సూటయ్యే అవకాశముంది. ఒరిజినల్లో బిజు చేసిన పోలీస్ పాత్ర బాగా హైలైట్ అయింది. ఆ పాత్రను సూర్యకు ఇస్తే ఇంకా ఇంప్రొవైజ్ చేసి బాగా పేలేలా చేస్తాడనడంలో సందేహం లేదు.

పృథ్వీరాజ్ పాత్రలో కార్తి కూడా బాగానే ఎలివేట్ కాగలడు. ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పటిదాకా కలిసి నటించింది లేదు. గతంలో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. ‘అయ్యప్పనుం కోషియుం’ లాంటి సినిమాతో ఈ బ్రదర్స్ కలిశారంటే అదిరిపోయే ఔట్ పుట్ రావడం ఖాయం.