అక్కినేని వారికి టైమొచ్చింది

లాక్ డౌన్ టైంలో అంద‌రు హీరోల అభిమానులూ ఏదో ర‌కంగా ఎంగేజ్ అవుతున్నారు. వాళ్లు ముచ్చ‌ట్లు పెట్ట‌డానికి, ట్రెండ్స్‌లో పాల్గొన‌డానికి ఏదో ఒక సంద‌ర్భం ఉంటోంది. కానీ అక్కినేని అభిమానులే అస‌లు చ‌డీచ‌ప్పుడు లేకుండా ఉన్నారు. ఆ ఫ్యామిలీ హీరోల నుంచి ఏ ర‌క‌మైన సినిమా అప్ డేట్లు లేవు. ఏవైనా ప్ర‌త్యేక సంద‌ర్భాలు వ‌స్తే ట్రెండ్స్ చేద్దామంటే అందుకూ అవ‌కాశం లేక‌పోయింది. లాక్ డౌన్ టైంలో మిగ‌తా హీరోల అభిమానులు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తుంటే అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రం గ‌త రెండు నెల‌ల్లో అలాంటి అవ‌కాశ‌మే లేక‌పోయింది. ఐతే ఎట్ట‌కేలకు వాళ్ల‌కూ టైమొచ్చింది. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ త‌దిత‌ర సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో వాళ్ల సంద‌డీ క‌నిపిస్తోంది.

అక్కినేని నాగార్జున కెరీర్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన అన్న‌మ‌య్య సినిమా రిలీజై శుక్ర‌వారానికి 28 ఏళ్లు పూర్త‌య్యాయి. 1997 మే 22న ఆ చిత్రం రిలీజైంది. ఈ సంద‌ర్భంగా ఈ క‌ల్ట్ క్లాసిక్ మీద హ్యాష్ ట్యాగ్స్ పెట్టి నాగ్ గొప్ప‌ద‌నంపై చ‌ర్చ న‌డిపారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర పోస్టులు, క‌థ‌నాలు కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక మే 23 అక్కినేని అభిమానుల‌కు మ‌రింత ప్ర‌త్యేకం. ఇది నాగ్ కెరీర్లో మ‌ర‌పురాని రోజు. నాగ్ హీరోగా ప‌రిచ‌యం అయిన విక్ర‌మ్ సినిమా రిలీజైంది ఆ రోజే. అంతే కాక అక్కినేని కుటుంబానికే అత్యంత ప్ర‌త్యేక‌మైన మ‌నం చిత్రం రిలీజైంది కూడా ఇదే తేదీకి. శ‌నివారంతో ఈ సినిమాకు ఆరేళ్లు పూర్త‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మే 23తో త‌న‌కున్న ప్ర‌త్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నాగ్ కూడా ట్వీట్ వేశాడు. దీంతో మ‌రింత ఉత్సాహంగా అభిమానులు ట్రెండ్స్‌కు రెడీ అయిపోయారు. శ‌నివారం అక్కినేని ఫ్యాన్స్ రెచ్చిపోయే అవ‌కాశ‌ముంది.