ప్రభాస్ సినిమా.. దర్శకుడి క్లారిటీ

‘బాహుబలి’తో ఆకాశాన్నంటే ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. ఇక ‘మహానటి’తో మేటి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. వీళ్ల కలయికలో సినిమా అనేసరికి ఎక్కడలేని ఎగ్జైట్మెంట్ కనిపిపించింది ప్రేక్షకుల్లో. ఈ చిత్రాన్ని అంతా అనుకూలిస్తే అక్టోబరులో మొదలుపెడదామని అనుకుంటున్నారు నిర్మాత అశ్వినీదత్.

ఐతే కరోనా ప్రభావం ఎలా ఉంటుందో.. ఎప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నదాన్ని బట్టి షూటింగ్ అప్ డేట్ ఉంటుంది. ఐతే ఈ లోపు ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా రానా కనిపించబోతున్నాడని.. ‘బాహుబలి’ కాంబినేషన్ పునరావృతం కాబోతోందని వార్తలు వచ్చాయి. ఐతే ఈ విషయంలో నాగ్ అశ్విన్ వెంటనే స్పష్టత ఇచ్చేశాడు. ఇంకా కాస్టింగ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నాడు.

ప్రభాస్ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని.. దీనిపై మీరేమంటారంటూ ఓ ట్విట్టర్ ఫాలోవర్ నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించాడు. అందుకతను బదులిస్తూ ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని.. లాక్ డౌన్ కారణంగా కొన్ని పనులు మాత్రం ఆలస్యమవుతున్నాయని.. ఐతే స్క్రిప్టు తయారీకి మాత్రం బాగా సమయం లభిస్తోందని చెప్పాడు.

ఇక కాస్టింగ్ విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఏదీ ఫైనలైజ్ కాలేదని అతను తేల్చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ అని.. ‘ఆదిత్య 369’ తరహాలో సాగుతుందని.. ‘క్రిష్’ స్టయిల్లో ఉంటుందని.. ఇంకా ఏవేవో ప్రచారాలు సాగుతున్నాయి. మొత్తానికి ఈ కథ అయితే అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందన్న సంకేతాలైతే చిత్ర బృందం నుంచి అందుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు.