బోలెడు సినిమాలు.. నిలిచేదేదో?

సంక్రాంతికి ‘క్రాక్’, వేలంటైన్స్ డే వీకెండ్లో ‘ఉప్పెన’ వసూళ్ల మోత మోగించి విడుదల కోసం చూస్తున్న కొత్త చిత్రాల నిర్మాతల్లో ఆశలు రేకెత్తించాయి. దీంతో వరుసబెట్టి సినమాలు వదిలేస్తున్నారు. చాన్నాళ్లుగా రిలీజ్ కోసం చూస్తున్న సినిమాలను క్లియరెన్స్ సేల్‌ టైపులో వారం వారం పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

గత వారం చిన్నా చితకా వాటితో కలిపి అరడజను సినిమాల దాకా రిలీజయ్యాయి. ఈ వారం ఆ నంబర్ ఇంకా పెద్దదిగా ఉంది. సందీప్ కిషన్ సినిమా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’తో పాటు రాజ్ తరుణ్ మూవీ ‘పవర్ ప్లే’నే కాక.. సీరియల్ నటుడు సాగర్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ‘షాదీ ముబారక్’, తారకరత్న చిత్రం ‘దేవినేని’, సుకుమార్ స్నేహితుడు హరిప్రసాద్ జక్కా రూపొందించిన ‘ప్లే బ్యాక్’, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ‘క్లైమాక్స్’, అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన థ్రిల్లర్ మూవీ ‘ఎ’.. విజయ్ సేతుపతి, యశ్‌ల డబ్బింగ్ చిత్రాలు ‘విక్రమార్కుడు’, ‘గజకేసరి’.. ఇలా ఈ వారం రిలీజవుతున్న సినిమాల జాబితా చాలా పెద్దదే.

ఐతే వీటిలో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం సందీప్ కిషన్ మూవీనే. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో ప్రి రిలీజ్ బాగానే కనిపిస్తోంది. మిగతా అన్ని సినిమాలూ కలిపి ఎన్ని థియేటర్లలో రిలీజవుతున్నాయో అంతకు మించి ఈ సినిమా పెద్ద స్థాయిలో విడుదలవుతుండటం విశేషం. లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ లాంటి ప్రముఖ తారాగణం ఈ సినిమాలో నటించారు. సందీప్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ కూడా పెట్టారీ చిత్రంపై. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్‌ లాగే దీన్ని తీర్చిదిద్దినట్లున్నారు. సందీప్ కోరుకుంటున్న పెద్ద బ్రేక్ ఈ సినిమా ఇస్తుందనే అంచనాలున్నాయి.

ఇక ‘ఒరేయ్ బుజ్జిగా’తో పర్వాలేదనిపించిన రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా ఈసారి ‘పవర్ ప్లే’తో థ్రిల్లర్ జానర్ ట్రై చేశారు. ఈ సినిమా ఓ మోస్తరుగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మిగతా చిత్రాలకైతే ఎలాంటి బజ్ కనిపించట్లేదు. అవేమైనా సెన్సేషనల్‌గా ఉంటేనే వాటి వైపు ప్రేక్షకుల దృష్టి మళ్లేలా ఉంది. మరి మూడు వారాలుగా సాగుతున్న ‘ఉప్పెన’ జోరుకు ఈ వారం వస్తున్న కొత్త చిత్రాల్లో ఏవైనా బ్రేకులేస్తాయేమో చూడాలి.