మాస్ రాజా కొత్త సినిమా ఫిక్స్

వ‌రుస‌గా నాలుగు డిజాస్ట‌ర్ల త‌ర్వాత మాస్ రాజా ర‌వితేజ క్రాక్ సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇన్నేళ్ల క‌రువు తీర్చేసేలా ఆ సినిమా భారీ విజ‌యాన్నందుకుంది. హిట్టొస్తే చాల‌ని మాస్ రాజా అభిమానులు కోరుకుంటే.. ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయి కూర్చుంది. ఈ సినిమా మీద పెట్టుబ‌డి పెట్టిన అంద‌రికీ భారీ లాభాలు అందించింది. ఈ స‌క్సెస్ ఊపులో ర‌వితేజ వ‌రుస‌గా సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

క్రాక్ రిలీజవ‌డానికి ముందే అనౌన్స్ చేసిన ఖిలాడి సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేయడం కోసం విరామం లేకుండా ప‌ని చేస్తున్నాడు ర‌వితేజ‌. ఈ సినిమా మే 28న‌ విడుద‌ల కానున్న సంగతి తెలిసిందే. ఇంత‌లోనే ర‌వితేజ నుంచి మ‌రో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. అత‌ను సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్, హ‌లో గురూ ప్రేమ కోస‌మే చిత్రాల రూప‌కర్త త్రినాథ‌రావు న‌క్కిన‌ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు. ఆదివార‌మే సాయంత్ర‌మే ఈ సినిమా గురించి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

ర‌వితేజ-త్రినాథ‌రావు కాంబినేష‌న్ ఎప్ప‌ట్నుంచో ప్ర‌చారంలో ఉన్న‌దే. త్రినాథ‌రావు చివ‌ర‌గా రామ్ హీరోగా హ‌లో గురూ.. తీశాడు. అద‌య్యాక ర‌వితేజ‌తో సినిమా తీయ‌బోతున్న‌ట్లు రెండేళ్ల కింద‌టే వార్త‌లొచ్చాయి. మ‌ధ్య‌లో వేరే హీరోల పేర్లూ వినిపించాయి. కానీ అవేవీ ఖ‌రార‌వ్వ‌లేదు. చివ‌రికి ఇప్పుడు ర‌వితేజ హీరోగానే త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.

త్రినాథ‌రావు మూడు హిట్ సినిమాలకూ ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ‌నే ఈ చిత్రానికి కూడా స్క్రిప్టు స‌మ‌కూరుస్తున్నాడు. ఐతే వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మూడు సినిమాలూ మామా అల్లుళ్ల గిల్లిక‌జ్జాల నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌లతోనే తెర‌కెక్కాయి. ఈసారి మాస్ రాజా హీరో కాబ‌ట్టి భిన్న‌మైన క‌థ‌తోనే సినిమా చేస్తుండొచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఫిలిమ్స్ ఉమ్మ‌డిగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాయి. ఈ సినిమాకు ప‌ని చేసే ఇత‌ర టెక్నీషియ‌న్లు, న‌టీన‌టుల వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. ఖిలాడి అవ్వ‌గానే ర‌వితేజ ఈ సినిమాను మొద‌లుపెడ‌తాడు.