‘బాహుబలి’ రికార్డ్ కొట్టేసిన KGF ఛాప్టర్ 2

ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా భావించే కన్నడ చిత్రసీమ స్టామినాను యావత్ భారతానికి పరిచయం చేసిన సినిమా ‘కె.జీ.ఎఫ్’. 2018లో విడుదలైన ‘ఛాప్టర్ 1’ మూవీ అఖండ విజయాన్ని అందుకుని, సాండల్‌వుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇండస్ట్రీ హిట్టు కొట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘కె.జీ.ఎఫ్’ ఛాప్టర్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే రికార్డు ధర చెల్లించి మరీ ‘కె.జీ.ఎఫ్ ఛాప్టర్ 2’ డిజిటల్ రైట్స్ దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్.

‘కె.జీ.ఎఫ్’ ఛాప్టర్ 1 చిత్ర డిజిటల్ రైట్స్‌ను రూ.18 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్. ఓ కన్నడ చిత్రానికి ఇదే అత్యధిక మొత్తం. ఛాప్టర్‌ 2లో బాలీవుడ్ స్టార్లు సంజయ్ దత్, రవీనా టండన్ వంటి నటీనటులు నటిస్తుండడంతో ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ భారీ డిమాండ్ ఏర్పడింది.

దీంతో ఏకంగా రూ. 55 కోట్ల భారీ మొత్తం చెల్లించి ‘కె.జీ.ఎఫ్ ఛాప్టర్ 2’ అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్. డిజిటల్ రైట్స్ రూపంలోనే ఓ దక్షిణ భారత చిత్రానికి ఇంత భారీ మొత్తం వసూలు కావడం ఓ రికార్డు.

ఇంతకుముందు టాలీవుడ్ వండర్ ‘బాహుబలి 2’ చిత్రానికి కూడా డిజిటల్ రైట్స్ రూపంలో రూ. 25.50 కోట్లు దక్కాయి. ‘బాహుబలి’ సెకండ్ పార్ట్‌కు రెట్టింపు మొత్తం దక్కించుకున్న ‘కె.జీ.ఎఫ్’… మరి ఆ సినిమా కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టగలదా? అదే జరిగితే కన్నడ స్టార్ యశ్ మరో సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే.

ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ‘కె.జీ.ఎఫ్ ఛాప్టర్ 2’ అక్టోబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సంక్రాంతికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.