టాలీవుడ్ మొత్తం ఆ బేనర్ చుట్టూనే

మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఈ బేనర్ చుట్టూనే తిరుగుతోంది. తెలుగులో ప్రస్తుతం ఈ సంస్థ ఉన్నంత దూకుడు మీద, అంత బిజీగా మరే బేనర్ కూడా లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లాంటి బేనర్లు కూడా జోరుగా సినిమాలు నిర్మిస్తున్నాయి. భారీ చిత్రాలను లైన్లో పెట్టాయి. కానీ మైత్రీ మూవీ మేకర్స్ బేనర్ దూకుడు ముందు అవి వెనుకే ఉంటాయి.

ఇటు స్టార్ హీరోలు, అటు స్టార్ డైరెక్టర్లలో మెజారిటీకి మైత్రీతో కమిట్మెంట్లున్నాయి. ఓవైపు మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ.. మరోవైపు పవర్ స్టార్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దానికి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో ఓ సినిమాను దక్కించుకుంది మైత్రీ. ఈ సినిమా గురించి ‘ఉప్పెన’ ఆడియో వేడుకలో చిరునే స్వయంగా వెల్లడించాడు.

ఇప్పటికే రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ.. జూనియర్ ఎన్టీఆర్‌ నుంచి కూడా కమిట్మెంట్ తీసుకుంది. కొంచెం ఆలస్యం అయితే కావచ్చు కానీ.. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్, తారక్ కాంబినేషన్లో ఓ సినిమాను మైత్రీ ప్రొడ్యూస్ చేయడం ఖాయం. అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ను నిర్మిస్తున్నదీ మైత్రీనే అన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న గోపీచంద్‌నూ తమతో సినిమాకు కమిట్ చేయించింది మైత్రీ.

గోపీచంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘క్రాక్’ సీక్వెల్‌ను ఈ సంస్థ నిర్మించే అవకాశాలున్నాయి. మరోవైపు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ ‘అనిమల్’ తీశాక మైత్రీలోనే ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించొచ్చని అంటున్నారు. ఇంకా మరిందరు టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకుల నుంచి కమిట్మెంట్లు తీసుకున్న మైత్రీ.. రాబోయే మూణ్నాలుగేళ్లలో తిరుగులేని స్థాయిని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.