వర్మ గారి సినిమాలొస్తున్నాయహో..

రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసి పదేళ్ల కిందటే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఆయన స్థాయి బాగా పడిపోయి నాసిరకం సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. గత మూణ్నాలుగేళ్లలో అయితే వర్మ మరీ పతనం అయిపోయాడు. అత్యంత పేలవమైన సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు. ఒకప్పుడు వర్మ ఫ్లాప్ సినిమాల్లోనూ క్వాలిటీ కనిపించేది. ఏదో ఒక ప్రత్యేకత ఉండేది.

కానీ గత కొన్నేళ్లలో అయితే వర్మ కనీస విలువలు లేకుండా సినిమాలు తీసి తన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడాయన. వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ సైతం ఆయన్ని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. కరోనా టైంలో అరగంట, గంట నిడివితో బూతు సినిమాలు తీసి ఆన్ లైన్ల పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్నాడు వర్మ. ఐతే ఈ టైపు సినిమాలను కూడా తర్వాత జనాలు పట్టించుకోవడం మానేశారు.

అయినా వర్మ ఏమీ ఆగిపోలేదు. తన శిష్యుల్ని పెట్టి సినిమాలు తీయిస్తూనే ఉన్నాడు. డిసెంబరు నెలలో వర్మ సినిమాలు ఒకటికి మూడు రిలీజవుతుండటం విశేషం. అవే.. కరోనా వైరస్, మర్డర్, దిశ ఎన్‌కౌంటర్. ఇందులో మర్డర్, దిశ సినిమాల మీద ఎంత వివాదం నడిచిందో తెలిసిందే. కోర్టు వివాదాలను అధిగమించి ఈ చిత్రాలను రిలీజ్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడు.

కరోనా వైరస్‌ను డిసెంబరు 11న థియేటర్లలోకి వదులాతడట వర్మ. 18న మర్డర్, 25న దిశ ఎన్‌కౌంటర్ రిలీజవుతాయట. ఐతే వర్మ సినిమాలను విడుదలకు సిద్ధం చేయడం, రిలీజ్ డేట్లు ప్రకటించడం, సోషల్ మీడియాలో విపరీతంగా వీటిని ప్రమోట్ చేయడం బాగానే ఉంది. కానీ వర్మ సినిమాల మీద జనాలకు కనీస స్థాయిలో కూడా ఆసక్తి కనిపించడం లేదు. వర్మ అదే పనిగా ట్విట్టర్లో ఊదరగొడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఆయన్ని పట్టించుకోవడం లేదు.

మరీ లో బడ్జెట్లో సినిమాలు తీసి సొమ్ము చేసుకుందామని చూసే వర్మకు ఈసారి ఆ కాస్త ఖర్చయినా వెనక్కి వస్తుందా అన్నది సందేహమే. ఎందుకంటే వర్మ సినిమాలొస్తున్నాయంటే దాన్ని అలెర్ట్‌గా భావించి ఆ ఛాయలకు వెళ్లకూడదని భావిస్తున్నారు జనాలు. కుర్రాళ్లు ఎగబడ్డానికి ఇప్పుడు వర్మ నుంచి వస్తున్నవి బూతు సినిమాలు కూడా కాదాయె.