ఫ్లాష్ బ్యాక్: తుపానును తిప్పికొట్టిన మెగా సునామీ

అది 1990 మే మొదటి వారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఆశ్చర్యకరంగా వేసవిలో తుపాను రాష్ట్రాన్ని ముంచెత్తింది. వర్షం ఉద్ధృతి పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ పెట్టుకున్నారు.

మే 9న సినిమా విడుదల కావాల్సి ఉంది. ముందు రోజు పరిస్థితి చూసి విడుదల వాయిదా వేయడం మంచిదని నిర్మాత అశ్వినీదత్‌కు సలహా ఇచ్చారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. అనుకున్న తేదీకే సినిమా రిలీజ్ చేయాల్సిందే అని పట్టుబట్టారు. కానీ ప్రింట్లను ఏపీలో వివిధ ప్రాంతాలకు చేరవేయడం కూడా కష్టంగా ఉంది. రైళ్లు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. కొన్ని చోట్లకు ప్రింట్లు సమయానికి చేరలేదు. కొన్ని చోట్ల ఒక షో వేసి ఆపేయాల్సిన పరిస్థితి.

రాష్ట్రంలో తుపాను ప్రభావం, సినిమా ప్రదర్శనకు ఎదురవుతున్న ఆటంకాల గురించి అశ్వినీదత్‌కు రిపోర్ట్స్ వచ్చాయి. తన వద్ద ఉన్న డబ్బంతా ఈ సినిమా మీదే పెట్టడంతో ఆయన చాలా భయపడ్డారు. తన కుటుంబం ఎక్కడ రోడ్డు మీదికి వస్తుందో అని ఆందోళన చెందారు. కానీ ఆయన భార్య మాత్రం తుపాను ఉద్ధృతి తగ్గాక ఈ సినిమా తుపాను మొదలవుతుందని అంది. ఆమె అన్నట్లే జరిగింది.

నాలుగైదు రోజులు కొంచెం కష్టంగా షోలు నడిచాయి. 14వ తేదీకి పరిస్థితులు చక్కబడ్డాయి. ఆ రోజు తుపాను తగ్గి మెగా సునామీ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు జనాలతో నిండిపోయాయి. వారం రెండు వారాలు కాదు.. 50 రోజులైనా సందడి తగ్గలేదు. అన్ని చోట్లా హౌస్ ఫుల్సే హౌస్ ఫుల్స్. ఆ రోజుల్లోనే దాదాపు ఆరు కోట్ల షేర్ తెచ్చిందీ సినిమా.

70 సెంటర్లలో రిలీజ్ చేస్తే.. 46 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అప్పట్లో అది రికార్డు. అప్పటికే పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలతో తిరుగులేని విజయాలందుకున్న చిరు.. ఈ సినిమాతో హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.