RRR టీజర్ రాకపోయినా.. ఇది బ్యాలెన్స్ చేస్తోంది

లాక్‌డౌన్ కారణంగా ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి స్పెషల్ టీజర్ వస్తుందో, లేదో డౌట్‌గా మారింది. ‘రామరాజు ఫర్ భీమ్’ కోసం ఇంకా కొన్ని షాట్స్ తీయాల్సి ఉందని స్వయంగా దర్శకుడు రాజమౌళి ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీజర్ రాకపోయినా ఫ్యాన్స్‌ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు తారక్ వీరాభిమానులు.

స్టార్ హీరో బర్త్‌డేకి అభిమానులందరూ కలిసి ఓ కామన్ డీపీ పెట్టడం ఇప్పుడు ఓ ట్రెండ్. పవన్ పుట్టినరోజుకి రామ్ చరణ్, మహేష్ బర్త్‌డేకి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇలా ఓ సెలబ్రిటీతో ఈ కామన్ డీపీ రిలీజ్ చేయడం కూడా టాలీవుడ్‌లో కొత్త ఫ్యాషన్. అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం ఏకంగా 25 మందికి పైగా సెలబ్రిటీలు కలిసి సీడీపీ రిలీజ్ చేస్తున్నారు.

హీరోయిన్లు కాజల్ అగర్వాల్, నివేధా థామస్, నిధి అగర్వాల్, రాశిఖన్నా, మెహ్రీన్ ఫిర్జాదా, హీరోలు రానా దగ్గుపాటి, కళ్యాణ్ రామ్, విశ్వక్ సేన్, నాగశౌర్య, మ్యూజిక్ డైరెక్టర్లు దేవిశ్రీ ప్రసాద్, తమన్, అనూప్ రూబెన్స్, డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, కె.ఎస్. రవీంద్ర (బాబీ), హరీశ్ శంకర్, నటుడు బ్రహ్మజీ, రాజమౌళి కుమారుడు కార్తికేయ, కీరవాణి కుమారుడు కాల భైరవలతో పాటు ప్రముఖ ప్రొడక్షన్ సంస్థలైన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, డీవీవీ, మైత్రీ మూవీస్, హరిక & హాసిని, సితార,ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ల నుంచి ఒకేసారి ఎన్టీఆర్ బర్త్‌డే కామన్ డీపీ విడుదల కానుంది.

మే 9న సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా ద్వారా ఈ సీడీపీ గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే చిత్రానికి సంబంధించి కూడా మే 20న టైటిల్ రిలీజ్ పోస్టర్ విడుదల కావచ్చని సమాచారం. అలాగే ‘కె.జీ.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి సంబంధించి కూడా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టాక్. మైత్రీ మూవీస్ బ్యానర్లో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

లాక్‌డౌన్ కారణంగా తారక్ బర్త్‌డే వేడుకలకు దూరమైన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇవి ఓ పండగలాంటి వార్తలే!