లక్ష్మీబాంబ్ ఏమో కానీ.. ఇది మాత్రం పక్కా

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి థియేటర్లు మూత పడి ఉండటం.. ఇంకో నాలుగైదు నెలలు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఎప్పుడో పూర్తయి విడుదల కోసం చూస్తున్న సినిమాలను నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేసే ప్రతిపాదనలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆల్రెడీ తెలుగులో ‘అమృతారామమ్’ అనే సినిమా ఇలాగే రిలీజైంది.

తమిళంలో కూడా ఓ సినిమాను ఇలా రిలీజ్ చేశారు. వాటికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఐతే కాస్త పేరున్న సినిమాల్ని రిలీజ్ చేస్తే ఈ ట్రెండ్ ఊపందుకోవచ్చు. హిందీలో అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన ‘లక్ష్మీబాంబ్’‌ను హాట్ స్టార్‌లో నేరుగా రిలీజ్ చేయబోతున్నారని.. అందుకోసం రూ.90 కోట్లతో డీల్ కుదిరిందని ఇటీవల వార్తలొచ్చాయి. ఐతే ఈ వార్తల్ని చిత్ర బృందం ధ్రువీకరించలేదు. అలాగని ఖండించనూ లేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది.

ఐతే ‘లక్ష్మీ బాంబ్’ సంగతేమో కానీ.. హిందీలోనే తెరకెక్కిన ఓ పేరున్న సినిమా మాత్రం ఓటీటీలో నేరుగా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పేరు.. ‘గూమ్ కేతు’. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఫాంటమ్ ఫిలిమ్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పుష్పేంద్రనాథ్ మిశ్రా దర్శకత్వం వహించాడు.

ఒక రచయిత కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవాజుద్దీన్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, సోనాక్షి సిన్హా లాంటి ప్రముఖ నటులు ఇందులో అతిథి పాత్రలు పోషించడం విశేషం. ఈ సినిమా మే 22న నేరుగా జీ5లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించాడు.

తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కావడం, లాభానికే డీల్ కుదరడం, నవాజుద్దీన్‌కు ఓటీటీల్లో సినిమాలు చూసే ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాను నేరుగా ఆన్ లైన్లో రిలీజ్ చేయడానికి ఇబ్బంది లేకపోయింది.