అంబానీ రేంజ్ ఏమిటో చెప్పే మూడు డీల్స్..

mukesh

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డబుల్ బ్రెడూం ప్లాట్ ను అమ్మే ప్రయత్నం చేయండి? మార్కెట్ రేటు కంటే తక్కువగా అడగటం ఖాయం. వారు అడిగిన మొత్తానికి ప్లాట్ ఇచ్చే కన్నా.. మన దగ్గరే ఉంచుకోవటం మేలన్న భావన కలగటం ఖాయం. ఒక చిన్న ప్లాట్ ను అమ్మే విషయంలోనే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్న వేళలో.. రూ.11వేల కోట్లతో డీల్ ను క్లోజ్ చేయటం మామూలు విషయం కాదు.

వేరే వారికైతే కష్టమేమో కానీ.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మాత్రం ఇది చాలా తేలికైన విషయం. ఆ మధ్యనే ఫేస్ బుక్ కు రిలయన్స్ జియోలో కొంత భాగాన్ని(9.9శాతం వాటా) రూ.43వేల కోట్లకుపైనే అమ్మటం.. ఆ తర్వాత 1.15 శాతం వాటాను రూ.5,666 కోట్లకు అమ్మిన ముకేశ్.. తాజాగా 2.32 శాతం వాటాను రూ.11,367 కోట్లకు క్లోజ్ చేయటం విశేషం.

ఈ ఏడాదికి రిలయన్స్ ను రుణభారం నుంచి విముక్తి చేస్తానని షేర్ హోల్డర్స్ కు తానిచ్చిన మాటకు తగ్గట్లు వరుస డీల్స్ ను చేస్తున్నారు ముకేశ్. తాజాగా జియోలో వాటాను కొనుగోలు చేసింది అంతర్జాతీయ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ దిగ్గజం విస్టా ఈక్విటీ పార్టనర్స్. కేవలం మూడు వారాలవ్యవధిలో మూడు డీల్స్ తో ఏకంగా రూ.60,596 కోట్లను సమీకరించటం గమనార్హం. మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. జియోలో కేవలం 13 శాతం వాటాను విక్రయించటం ద్వారా ఇంత భారీ మొత్తాన్ని సమీకరించటం అంబానీకే చెల్లిందని చెప్పాలి.

మొత్తంగా చూస్తే.. జియోలో 20 శాతం వాటాను అమ్మటమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముకేశ్. ఇప్పటికే పదమూడున్నర శాతం (కచ్ఛితంగా చెప్పాలంటే 13.46శాతం) అమ్మిన ఆయన.. మరో ఆరున్నర శాతాన్ని రానున్న కొద్ది రోజుల్లో అమ్మనున్నారు. దాని ద్వారా తక్కువలో తక్కువ రూ.33వేల కోట్ల వరకు నిధులు సమీకరించే వీలుంది. అంటే.. జియోలో 20 శాతం వాటా అమ్మకంతో దగ్గర దగ్గర రూ.లక్ష కోట్ల వరకూ సమీకరించనున్నారు.

ఇప్పటికే రిలయన్స్ వద్ద నగదు నిల్వలు రూ.1.75లక్షల కోట్లు. రిలయన్స్ రుణభారం మొత్తం రూ.3.36లక్షల కోట్లు. ఈ ఏడాది చివరకు రిలయన్స్ కు ఉన్న రుణాలు మొత్తాన్ని తీర్చేసే లక్ష్యాన్ని అందుకునేందుకు అవసరమైన రైట్స్ ఇష్యూ చేయటం ద్వారా మరో రూ.లక్ష కోట్లు సమీకరిస్తారని చెబుతున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు ముకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం ఖాయమంటున్నారు. అయినా.. అపర కుబేరుడు అనుకుంటే కానిది ఏముంటుంది చెప్పండి?