మోడీ ప‌ద్మ వ్యూహం.. గ‌మ‌నించారా…!

కొన్ని కొన్ని విష‌యాలు.. చూసేందుకు చాలా బాగుంటాయి. వినేందుకు ఇంకా బాగుంటాయి. కానీ, వాటి మాటున అస‌లు సిస‌లు రాజ‌కీయం దాగి ఉంటుందంటే ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కూడా.. ఇదే రాజ‌కీయ వ్యూహాన్ని చాలా మెత్త‌గా.. క‌మ్మ‌గా.. ఆవిష్క‌రించింది. పైకి ఎంతోమెప్పుగా కూడా ఉన్న ఈ వ్యూహం ఫ‌క్తు.. త‌న స్వ‌లాభానికేన‌న్న విషయం సుస్ప‌ష్టం.

తాజాగా రెండుతెలుగు రాష్ట్రాల‌కు భారీ ఎత్తున ప‌ద్మ అవార్డులు ప్ర‌క‌టించారు. ఇది చాలా సంతోషించాల్సిన విష‌యం. అంత‌కుమించి.. గ‌త ప్ర‌భుత్వాలు ఇలా ఎప్పుడూ చేయ‌లేద‌ని.. అప్ప‌ట్లో ఎంతో అన్యా యం జ‌రిగింద‌ని క‌ళ్లు తుడుచుకోవాల్సిన అంశం కూడా! ఎందుకంటే.. గ‌త చ‌రిత్ర‌లో ఇంకో మాట‌లో చెప్పాలంటే.. స్వాతంత్రం వచ్చిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఎవ‌రూ ఇవ్వ‌ని విధంగా ప‌ద్మాలు రాలాయి.

ఒకింత లోతుగా గ‌మ‌నిస్తే..రెండు తెలుగు రాష్ట్రాల‌కే కాదు.. ద‌క్షిణాదిలో ఉన్న తమిళ‌నాడు, క‌ర్ణాట‌క‌పై కూడా ప‌ద్మాల వ‌ర్షం కురిసింది. ఇదంతా కూడా.. అన్‌సంగ్ హీరోస్‌ను.. అంటే.. మ‌ట్టిలో మాణిక్యాల‌ను మోడీ గుర్తించి ఇచ్చిన ప్ర‌త్యేక గుర్తింపుగా ప్రచారం చేసుకునేందుకు.. చాలా బాగుంది. అయితే, అదే స‌మ‌యం లో దీనిని కొంత త‌ర‌చి చూస్తే.. ఫ‌క్తు రాజ‌కీయం క‌ళ్ల‌కు క‌డుతోంది. ప‌ద్మాల మాట వేసిన రాజ‌కీయ వ్యూహాలు సుస్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

ఒక‌టి.. తెలంగాణ‌లోను, క‌ర్నాట‌క‌లోనూ.. ఈ ఏడాది ఎన్నిక‌లు వున్నాయి. వీటిలో తెలంగాణ‌ను ప్రాణ‌ప్రదంగా తీసుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వం.. ఇక్క‌డ పాగా వేయాల‌ని భావిస్తోంది. అదేస‌మ‌యంలో ఉన్న అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు క‌మ‌ల నాథులు క‌ర్ణాట‌క‌లో చ‌క్రం తిప్పుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ప‌ద్మాల వ్యూహాన్ని అమ‌లు చేశార‌నేది విశ్లేష‌కుల అంచ‌నాగా ఉంది. ఇక్క‌డి ప్ర‌జ‌ల సెంటిమెంటును ర‌గించ‌డంతోపాటు.. కాంగ్రెస్ వంటి బ‌ల‌మైన ప‌క్షాల‌ను తొక్కి పెట్ట‌డం కూడా దీనివెనుక ఉంద‌ని అంటున్నారు. మొత్తానికి ఈ ప‌ద్మ వ్యూహానికి ఓట్ల తుమ్మెద‌లు ఎన్ని వాలుతాయో చూడాలి.