మసీదు ఎలా కూలిపోయింది ? సీబీఐ దర్యాప్తు ఇంత అద్వాన్నమా ?

దాదాపు 28 సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘటనపై తాజాగా సీబీపీ ప్రత్యేక కోర్టు ఇఛ్చిన తీర్పు తర్వాత అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లక్నోలోని ప్రత్యేక కోర్టు మసీదు కూల్చివేత ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులపై సీబీఐ ఆధారాలు సమర్పించలేదని చెప్పటం సంచలనంగా మారింది.

ఓ వ్యూహం ప్రకారం మసీదును కూల్చివేసినట్లు కానీ, కూల్చివేతలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై సరైన సాక్ష్యాలు లేవని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. పైగా మసీదు కూల్చివేత కుట్ర అనేందుకు సరైన ఆధారాలు కూడా సీబీఐ ప్రవేశపెట్టలేదని కోర్టు చెప్పింది. మసీదును కూల్చేసినపుడు వీడియోలు కానీ సరైన ఫొటోలను కూడా దర్యాప్తు సంస్ధ ప్రవేశపెట్టలేదన్నారు. ఫొటోలకు నెగిటివ్ కూడా చూపించలేకపోయిందని సీబీఐ దర్యాప్తుపై కోర్టు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఈ పాయింట్లన్నీ ఓ ఎత్తైతే మసీదును కూల్చేయాలని కరసేవకులను ప్రముఖులు రెచ్చగొట్టారనేందుకు కూడా సాక్ష్యాలు లేవని కోర్టు అభిప్రాయపడింది . పైగా విశ్వహిందు పరిషత్ మాజీ చీఫ్ అశోక్ సింఘాల్ మసీదు కూల్చివేతను కాపాడేందుకు ప్రయత్నించారంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపింది. దాదాపు 28 సంవత్సరాలు విచారణ జరిపిన తర్వాత ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా అనేకమంది మండిపోతున్నారు. ఎవరు కూల్చకపోతే వందల సంవత్సరాల నాటి పటిష్టమైన మసీదు ఎలా కూలిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

నిజానికి బాబ్రీమసీదు కూల్చివేత లక్ష్యంగా అప్పటి బిజెపి ప్రముఖ నేత ఎల్కే అద్వాణీ చేసిన రథయాత్ర, కరసేవకుల దేశవ్యాప్త ఉద్యమం, మసీదు కూల్చివేత టార్గెట్ గా అప్పట్లో బిజెపితో పాటు అనుబంధ సంఘాల ప్రముఖులు చేసిన ప్రసంగాలు అన్నీ యూట్యూబ్ లో వీడియోల రూపంలో ఇప్పటికీ కనబడుతున్నాయి. మసీదు కూల్చివేతే టార్గెట్ గా చాలామంది ప్రముఖులు గునపాలు, గడ్డపారలు తదితరాలు తీసుకుని మసీదుపైకి ఎక్కి కూల్చేసేందుకు చేసిన ప్రయత్నాల వీడియో, ఫొటోల కాపీలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి.

సరే తీర్పును పక్కనపెట్టేస్తే సీబీఐ పనితీరుపై కోర్టు ఆక్షేపణపైనే అందరు దృష్టిపెట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన దేశ రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిందని చెప్పాలి. అప్పటి వరకు దేశంలో నామమాత్రంగా మాత్రమే ఉన్న బిజెపి ఘటన తర్వాతే బలం పుంజుకుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఘటన తర్వాతే మొదటిసారి ఉత్తరప్రదేశ్ లో అత్యధిక ఎంపి స్ధానాలను గెలుచుకుంది. ఆ తర్వాతే జాతీయస్ధాయిలో అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది.

మరి ఇన్ని సంవత్సరాల దర్యాప్తులో మసీదు కూల్చివేతపై ప్రముఖుల పాత్రకు ఆధారాలను సీబీఐ ఎందుకు ఆధారాలను ప్రవేశపెట్టలేకపోయింది ? కోర్టు చేసిన ఆక్షేపణపై సీబీఐ దర్యాప్తుపైనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అసలే సీబీఐ అన్నది పంజరంలో చిలక లాంటిది అనే వ్యాఖ్యలను గతంలో సుప్రింకోర్టే చేసింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రత్యర్ధులపై ఉసిగొల్పటానికి సీబీఐని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఇటువంటి నేపధ్యంలో దర్యాప్తు సంస్ధపై కోర్టు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా డ్యామేజ్ అయ్యేవే అనటంలో సందేహం లేదు.

ఎవరు మసీదును కూల్చకపోతే దానంతట అదే కూలిపోయిందా ? అంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వేసిన ప్రశ్నకు మద్దతు పెరిగిపోతోంది. మసీదు కూల్చివేతకు ముందు యూట్యూబ్ లో కనబడుతున్న అద్వానీ లాంటి ప్రముఖుల ప్రసంగాలను కూడా సిబీఐ సంపాదించలేకపోయిందా ? అంటూ కాంగ్రెస్ నేతలు, ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసి, ప్రకాశ్ రాజ్ లాంటి వేస్తున్న ప్రశ్నకు సీబీఐ ఏమని సమాధానం చెబుతుందో ?