కరోనా వ్యాక్సిన్ కోసం 5 లక్షల షార్క్స్‌ను చంపేస్తున్నారా?

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాకు మందు కోసం ఎదురు చూస్తోంది. ఈ వైరస్‌ను నిరోధించే వాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఉద్ధృతంగా ప్రయోగాలు సాగిస్తున్నారు. దీని మీద వేల కోట్ల పెట్టుబడులు కూడా పెట్టారు. ఇంతకీ కరోనా వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారు.. దానిక్కావాల్సిన ముడి సరుకు ఏంటి అనే విషయంలో రకరకాల వార్తలొస్తున్నాయి.

ఐతే కరోనా వ్యాక్సిన్ తయారీకి సముద్ర జీవులైన షార్క‌్‌లను లక్షల సంఖ్యలో చంపాల్సి ఉంటుందని మీడియాలో కథనాలు వస్తుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలంటే మొత్తంగా కనీసం 5 లక్షల షార్క్‌లను చంపాల్సి ఉంటుందట. షార్క్‌లను చంపి తయారు చేసే నేచురల్ ఆయిల్‌ను కరోనా వ్యాక్సిన్ కోసం ఉపయోగిస్తారట. ఈ ఆయిల్‌ను స్క్వేలీన్ అని కూడా అంటారట.

ఈ స్క్వేలీన్‌లో రోగ నిరోధక శక్తిని బాగా పెంచే లక్షణాలు ఉంటాయట. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకసారి కరోనా డోస్ ఇవ్వడానికి రెండున్నర లక్షల షార్క్‌లను చంపాల్సి ఉంటుందట. కరోనా డోస్ రెండుసార్లు ఇస్తే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్న అంచనాల నేపథ్యంలో మొత్తం 5 లక్షల షార్క్‌లను చంపబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. షార్క్‌ల్లో కూడా అనేక రకాలుంటాయి. అందులో స్క్వేలీన్ అధికంగా ఉండేవి గల్పర్ షార్క్, బాస్కింగ్ షార్క్.

ఈ అంచనాలకు తగ్గట్లే వివిధ దేశాల్లోని షార్క్‌లను చంపుతూ వెళ్తే వాటి మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ మానవ జాతిని అమితంగా ప్రభావితం చేసిన కరోనాను ఎదుర్కోవడానికి ఇంతకుమించి మార్గం లేదన్నది వాస్తవమే. దీనికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో షేర్ చేస్తూ మనకు జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఇది నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు.