`బాబ్రీ` తీర్పుతో న్యాయాన్ని సమాధి చేశారు:ప్రకాష్ రాజ్

ప్రస్తుతం బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. 1992 డిసెంబరు 6వ తేదీన జరిగిన బాబ్రీ కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితోపాటు బీజేపీ మహిళా నేత ఉమాభారతి సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ కేసును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో బాబ్రీ తీర్పుపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు తీర్పులో న్యాయాన్ని అరెస్టు చేసి సమాధి చేశారని ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్లు చేశారు.

ఈ కేసును హిట్ అండ్ రన్ కేసుగా అభివర్ణించిన ప్రకాష్ రాజ్….డ్రైవర్లను నిర్దోషులుగా తేల్చారంటై వ్యగ్యంగా ట్వీట్ చేశారు. న్యాయాన్ని అరెస్టు చేసి సమాధి చేశారని, ఇదే నవ భారతం అని ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ప్రముఖ రచయిత్రి గౌరీ లంకేశ్ హత్యకు గురైనప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై ప్రకాష్ రాజ్ సందర్భాన్ని బట్టి తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. గౌరీ లంకేశ్ హ‌త్య‌పై ప్రధాని మోదీ స్పందించ‌క‌పోవ‌డంపై ప్రకాశ్‌ రాజ్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. # JustAsking అంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ సర్కార్ పై ప్రకాష్ రాజు పలుమార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను హిందువుల‌కు ఏమాత్రం వ్య‌తిరేకం కాదని, కేవ‌లం మోదీ, అమిత్ షాల‌కు మాత్రమే వ్య‌తిరేకమ‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.