ఈ తిరుగుబాటు మోడీ ఊహించలేదా?

వ్యవసాయ సంస్కరణలపై కేంద్రప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా మెల్లిగా ఆందోళనలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే దేశంలోని పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో రైతులు ఆందోళలన పేరుతో రెడ్డెక్కిన విషయం అందరికీ తెలిసిందే. గడచిన పదిరోజులుగా పంజాబ్ లో రైతులంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాని ఫలితంగానే కేంద్రం ప్రభుత్వం ఎన్డీఏ లో నుండి అకాలీదళ్ బయటకు వచ్చేసింది. ముందుగా అకాలీదళ్ తరపున మంత్రి మన్ ప్రీత్ రాజీనామా చేశారు. అయినా కేంద్రం బిల్లుల విషయంలో వెనక్కు తగ్గకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్న వెంటనే ఏకంగా ఎన్డీఏకే పార్టీ గుడ్ బై చెప్పేసింది.

పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో రైతులు చాలా యాక్టివ్ గా ఉంటారు. పైగా కేంద్ర ప్రభుత్వానికి బాగా దగ్గరగా ఉంటారు కాబట్టి ఢిల్లీలో మొదలయ్యే సెగ దక్షిణాది రాష్ట్రాలకన్నా ముందుగా ఉత్తరాధిరాష్ట్రాలకే తగులుతుంది. ఇందుకే ఉత్తరాధి రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ఏపిలో కూడా మెల్లిగా ఆందోళనలు రాజుకుంటున్నాయి. అంటే రాష్ట్రం మొత్తం అని కాకుండా పీస్ మీల్ పద్దతిలో ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని రైతులు అక్కడక్కడ ఏకమై తమ నిరసనను తెలిపారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యవసాయ సంస్కరణల బిల్లులు చట్టంగా రూపుదిద్దుకోవటానికి అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు మద్దతు పలకటం. అంటే కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టానికి రెండు పార్టీలు మద్దతుగా ఉన్నాయి కాబట్టే పార్టీల తరపున లేదా పార్టీల్లోని రైతు విభాగాల తరపున ఎక్కడా నిరసనలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ కారణంగానే పార్టీల నేతలు కూడా ఎక్కడా రైతులకు మద్దతు పలకటం లేదు.

మొదటినుండి వ్యవసాయ సంస్కరణల బిల్లుల విషయంలో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకంగా ఉంటే ఎన్డీఏ పక్షాలు మాత్రమే మద్దతుగా నిలబడ్డాయి. అలాంటిది అకాలీదళ్ రూపంలో ప్రధానమంత్రి నరేంద్రమోడికి పెద్ద షాక్ తగిలింది. సరే బిల్లుల విషయంలో రాజకీయ పార్టీలది తలా ఓ దారైతే వ్యవసాయ రంగంలో నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా అదే బాటలో నడవటమే విచిత్రంగా ఉంది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి మద్దతుగా కొందరు నిపుణులు మాట్లాడుతుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

సరే వీళ్ళ విషయాన్ని పక్కనపెట్టేస్తే చట్టాన్ని తెలంగాణా ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణాలో కూడా ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో జరిగిన రైతుల ఆందోళనలు కూడా మీడియాలో పెద్దగా హైలైట్ కావటం లేదు. ఏపిలో అంటే అధికార, ప్రధాన ప్రతిపక్షం ఒకటే బాటలో ఉన్నాయి కాబట్టి రైతుల ఆందోళనలు హైలైట్ కాలేదని అనుకోవచ్చు. మరి తెలంగాణాలో టిఆర్ఎస్, కాంగ్రెస్ లు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి కదా. మరెందుకు తెలంగాణాలో కూడా రైతుల ఆందోళనలు వెలుగులోకి రావటం లేదు ? రైతుల ఆందోళనలను రాష్ట్రప్రభుత్వాలు పట్టంచుకోక పోయినా ప్రధానమంత్రి మాత్రం రెండు రోజులుగా స్పందిస్తున్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయంటున్నారు. తాము చేసిన చట్టాలు సరైనవే అయితే ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తుంటే మోడి అసలెందుకు స్పందించాలి ? అంటే రైతుల ఆందోళనల విషయంలో మోడికి కూడా ఎక్కడో బెరుకు మొదలైనట్లే అర్ధమవుతోంది. సరే ఎవరైనా ఎన్నిరోజులు అన్నదాతల ఆందోళనలను అణిచిపెట్టగలరు ?