కీల‌క ప‌థ‌కాల‌కు బ్రేకులు.. జ‌గ‌న్ ముందున్న వ్యూహం ఏంటి?

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతోంది. కీల‌క ప‌థ‌కాలు నిలిచిపోయాయి. ఏం చేయాలన్నా.. ఎక్క‌డ ఎలాంటి బ్రేకు ప‌డుతుందో.. ఎటు వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు చుట్టుముడ‌తాయోన‌ని పార్టీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. నిజానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి.. ఏడాదిన్నర పూర్త‌యినా.. ఆయ‌న సంక‌ల్పించిన ప‌థ‌కాల‌న్నీ ప‌రిపూర్ణంగా అమ‌లులోకి వ‌చ్చి ఉంటే.. ఇది ప‌దేళ్ల పాల‌న‌తో స‌మాన‌మ‌ని మేధావులు అంటున్నారు. కానీ, అలా సాగ‌డం లేదు.. కొన్ని శ‌క్తులు అలా సాగ‌నివ్వ‌డ‌మూ లేదు. ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న ప‌థ‌కాల్లో స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, రైతు భ‌రోసా కేంద్రాలు, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలు వంటివి గొప్ప‌గా ఉన్నాయి.

కానీ, జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన అనేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు కూడా పూర్తిగా అమ‌లుకు నోచుకుని ఉంటే.. రాష్ట్రంలో ప్ర‌భుత్వ వేగం.. మ‌రో రూపంలో ఉండేద‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న నిలిచిపోయింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో.. ఆంగ్ల మాధ్య‌మం అడుగులు ముందుకు సాగ‌డం లేదు. పేద‌ల‌కు ఇళ్లు ప‌థ‌కం కూడా ఎక్క‌డి గొంగళి అక్క‌డే అన్న‌చందంగా మారింది. ఇక‌, శాస‌న మండ‌లి ర‌ద్దు కూడా ఇలానే ఉంది. జిల్లాల విభ‌జ‌న ఏర్పాటు వ‌చ్చే ఏడాదికి అయితే అయిన‌ట్టే. పోల‌వ‌రం నిర్మాణం కూడా ముందుకా వెన‌క్కా.. అన్న‌ట్టుగానే సాగుతోంది. మ‌రీముఖ్యంగా సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, గండికోట రిజ‌ర్వాయ్‌.. వంటివి కూడా స‌వాలుగా మారాయి.

నిజానికి వీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగి ఉంటే.. పార్టీ ప‌రిస్థితి, ప్ర‌భుత్వ ప‌రిస్థితి కూడా వేగంగా ఉండేద‌ని అంటున్నారు. కానీ, వీటిలో కొన్నిన్యాయ‌ప‌రంగా.. ఆగిపోగా.. మ‌రికొన్ని కేంద్రం నుంచి సంపూర్ణ స‌హ‌కారం లేని కార‌ణంగా నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు ఏంచేయాలి. మ‌రో మూడేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీనిలోనూ చివ‌రి ఆరు మాసాలు కూడా ఎన్నిక‌ల హ‌డావుడితోనే స‌మ‌యం గ‌డిచిపోతుంది. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకోవాలి? ఎలా ముందుకు సాగాలి? అనే చ‌ర్చ వైసీపీలో ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే మ‌రికొన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు తీసుకురావ‌డంతోపాటు.. నేరుగా సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. సాగుతున్న మాట వాస్త‌వం.