ట్విట్టర్‌ను ఫుట్‌బాల్ ఆడుకున్న ఆ క్రికెటర్

‘‘రాహుల్ తెవాతియాను చూస్తే బాధ కలుగుతోంది. అతను తన జట్టును ఓడిస్తున్నాడు’’… ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లె ఆదివారం రాత్రి 10.42 గంటలకు పెట్టిన ట్వీట్ ఇది. ఆ సమయానికి ట్విట్టర్లో అందరూ కూడా ఈ తెవాతియాను చెడామడా తిడుతున్నారు. బూతులు అందుకుంటున్నారు. రాబిన్ ఉతప్ప, జోఫ్రా ఆర్చర్ లాంటి ఆటగాళ్లుండగా వీణ్నెవర్రా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది అని కామెంట్లు చేస్తున్నారు. అప్పటికి తెవాతియా అంత చెత్తగా ఆడుతున్నాడు మరి.

20 ఓవర్లలో 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. తెవాతియా క్రీజులోకి వచ్చే సమయానికి సాధించాల్సిన రన్‌రేట్ 13కు పైనే ఉంది. అలాంటి టైంలో వచ్చి ఫోర్లు సిక్సర్లు కొట్టకపోగా.. సింగిల్స్ తీయడానికి కూడా అవస్థలు పడుతుంటే తిట్టకుండా ఎలా ఉంటారు. రాజస్థాన్ ఫ్యాన్స్ అనే కాదు.. పోటాపోటీగా సాగుతున్న మ్యాచ్‌ను నిస్సారంగా మార్చేస్తున్నాడంటూ న్యూట్రల్ ఫ్యాన్స్ సైతం తెవాతియాను తెగ తిట్టిపోశారు.

ట్విట్టర్లో ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ ఓ అరగంట పాటు తెవాతియాను తిట్టడానికే పరిమితం అయ్యారు. కానీ ఒక పది నిమిషాల తర్వాత తమ ట్వీట్లను చూసుకుని వాళ్లందరూ సిగ్గు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. కాట్రెల్ లాంటి వెస్టిండీస్ ప్రధాన ఫాస్ట్‌బౌలర్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది ఔరా అనిపించాడు ఈ అనామక ఆటగాడు. ఆ దెబ్బతో ట్విట్టర్ జనాలకు నోట మాట రాలేదు. తెవాతియా విషయంలో అన్న మాటలకు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది.

రాజస్థాన్ ఆడిన తొలి మ్యాచ్‌లో తెవాతియా మూడు వికెట్లు తీయడంతో అతణ్ని బౌలర్‌గానే చూశారందరూ. నాలుగో స్థానంలో ఫించ్ హిట్టర్ టైపులో బ్యాటింగ్‌కు బంతులు వృథా చేస్తుంటే అతణ్ని తిట్టుకున్న వాళ్లందరూ కొంతసేపటికి యుటర్న్ తీసుకున్నారు. మొత్తంగా ఏడు సిక్సర్లు బాది రాజస్థాన్ చేజారిందనుకున్న మ్యాచ్‌ను ఆ జట్టు చేతుల్లోకి తెచ్చాడతను. చివర్లో ఆర్చర్ సైతం కొన్ని షాట్లు అందుకోవడంతో రాజస్థాన్ తేలిగ్గానే మ్యాచ్ గెలిచేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్య ఛేదనతో రాయల్స్ రికార్డు నెలకొల్పింది. మయాంక్ అగర్వాల్ సెంచరీ కొట్టడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగా.. తెవాతియా కంటే ముందు స్మిత్, శాంసన్ ధాటిగా ఆడి జట్టు విజయానికి మంచి పునాది వేశారు.