పురంధరేశ్వరి, డీకే అరుణలకు కీలక పదవులు

2019 ఎన్నికలలో దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీచిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ…2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే పార్టీకి కొత్తరూపు కల్పించేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పరిచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన కార్యవర్గం జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో నలుగురు తెలుగువారికి స్థానం దక్కింది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శిగా ఏపీకి చెందిన సత్యకుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి డీకే అరుణ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ను నడ్డా నియమించారు. తెలుగునేతలు రాంమాధవ్, మురళీధర్ రావులకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

వివిధ విభాగాలలో పలువురు నేతలను ఎంపిక చేసిన బీజేపీ… తెలంగాణకు చెందిన డీకే అరుణ, ఏపీకి పురంధేశ్వరికి జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుని గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన డీకే అరుణ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డారు. అయితే, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు ఆ పదవి కట్టబెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఈ క్రమంలోనే డీకే అరుణకు పార్టీలో ప్రాధాన్యత లేదన్న ప్రచారం జరిగింది. ఈ క్రమం లోనే తాజాగా డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో చోటు కల్పించినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఏపీ నుంచి బీజేపీ జాతీయ కమిటీలో కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరికి చోటు దక్కింది. ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవిని కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు కట్టబెట్టిన బీజేపీ.. పురంధేశ్వరికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉంటే ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టినట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. జాతీయ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ ఆమె ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.