బాలూ.. ఏందయ్యా ఈ అభిమానం?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని గత నెలలో వార్త బయటికి రావడం ఆలస్యం.. సోషల్ మీడియా హోరెత్తిపోయింది. మిగతా అంశాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ. ఆయన కోసం ప్రార్థనలు. ఆయన గొప్పదనాన్ని చాటే పోస్టులు. ఆ సందర్భంగా బాలు అభిమానుల ఆరాటం చూస్తే.. ఆయన మీద ఏ స్థాయిలో అభిమానం ఉందో అర్థమైంది. బాలు కోలుకుని తిరిగొచ్చాక తన మీద జనాల అభిమానం చూసి ఎంతగా ఆశ్చర్యపోతారో అనిపించింది. అది జరుగుతుందనే ఆశించారు కానీ.. చివరికి ఊహించనిది జరిగిపోయింది. బాలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు పై నుంచి భూమి మీద తన మీద కురుస్తున్న అభిమానం చూస్తే అబ్బురపడకుండా పోరేమో.

బాలు తెలుగువాడు కాబట్టి, ఇక్కడే మెజారిటీ పాటలు పాడాడు కాబట్టి మనం ఆయన మీద ప్రేమ కురిపించడం, బాధ పడటంలో ఆశ్చర్యం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల అవతల బాలు అభిమానం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఎవరికి వాళ్లు బాలును తమ వాడిగా చేసుకుని కురిపిస్తున్న అభిమానం అపూర్వమైనది. ముఖ్యంగా తమిళనాడులో బాలును దేవుడిలా చూస్తున్నారు. నిన్న ఆసుపత్రి నుంచి బాలు ఫామ్ హౌస్‌కు ఆయన మృతదేహాన్ని తీసుకొస్తుంటే సామాన్య జనం వేలాదిగా రోడ్ల మీదికి వచ్చేశారు. ఆయన మీద పూల వర్షం కురిపించారు. ఒక చోట అయితే కాన్వాయ్‌కు అడ్డం పడిపోయి బాలు పార్థివ దేహం ఉన్న వాహనం ముందు చేతులు జోడించారు. దాని మీద పూల వర్షం కురిపించారు.

ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే.. బాలు మృతి గురించి తెలిసి ఉత్తరాది జనాలు స్పందించిన తీరు కూడా ఆశ్చర్యం గొలిపేదే. ఆయన పాటల్ని గుర్తు చేసుకుంటూ వాళ్లు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి సినీ సెలబ్రెటీలే కాదు.. సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ లాంటి క్రికెటర్లు సైతం బాలు పాటల మీద తమ అభిమానాన్ని చాటుకుంటూ ట్వీట్లు వేశారు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం సంగక్కర సైతం బాలు గురించి ట్వీట్ వేయడం గమనార్హం. ఇక బీబీసీ వరల్డ్ న్యూస్ ఛానెల్లో బాలు గురించి గొప్పగా చెబుతూ ఆయన మరణవార్తను చదివారు. మలేషియా మాజీ మంత్రి ఒకరు బాలుకు సంతాపం చెబుతూ పోస్ట్ పెట్టారు. ఇదంతా చూసి బాలు కీర్తి విశ్వవ్యాప్తమని స్పష్టమవుతోంది.