చంద్రబాబు చెప్పులు మోసిన కేసీఆర్: రేవంత్

ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా నేతల డబ్బుతో పార్టీ పెట్టిన కేసీఆర్….చంద్రబాబు చెప్పులు మోశారని సంచలన కామెంట్లు చేశారు. బషీర్బాగ్ కాల్పులకు కేసీఆర్, పోచారం, గుత్తా సుఖేందర్ రెడ్డి కారణమని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

టీడీపీలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది కేసీఆర్ అని దుయ్యబట్టారు. విద్యుత్ విషయంలో తెలంగాణ మంత్రులు వితండవాదం చేస్తున్నారని అన్నారు. 2009కి ముందు టీడీపీపై విమర్శలు గుప్పించిన కేసీఆర్….ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ సహకారంతోనే సిరిసిల్లలో కేసీఆర్, కేటీఆర్ చావుతప్పి కన్నులొట్టపోయి 150 ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ ల దయాదాక్షిణ్యాలతో బతికే పరాన్నజీవులు అని కేసీఆర్ పై మండిపడ్డారు. ఆ పార్టీలతో బతికి అదే పార్టీని తిట్టే నీచ సంస్కృతి అని మండిపడ్డారు. మంత్రి పదవి కోసం ఆనాడు చంద్రబాబు చెప్పులను కేసీఆర్ మోశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆర్థిక సాయంతోనే కేసీఆర్ పార్టీ పెట్టారని, చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వేమూరి రాధాకృష్ణతో పాటు పలువురిని కేసీఆర్ బతిమిలాడారని విమర్శలు గుప్పించారు. ఇక, శాసనసభ స్పీకర్ పోచారం, శాసనమండలి చైర్మన్ గుత్తా రాజకీయాలు మాట్లాడటం ఏమిటని మండిపడ్డారు. అంతేకాకుండా, వారు ప్రతిపక్ష పార్టీలను కూడా విమర్శిస్తున్న వైనాన్ని తప్పుపట్టారు. వారిద్దరికీ వయసు, ఒళ్ళు పెరిగినా బుద్ధి లేదని, బుద్ధి పెరగలేదని అన్నారు. స్వామి గౌడ్ లాంటి వారిని చూసి ఎలా హుందాగా ఉండాలో నేర్చుకోవాలని హితవు పలికారు.

తన కొడుకు అక్రమ కేసులు, ధందాల నుండి తప్పించుకోవడానికి కేసీఆర్ చెప్పులు పోచారం మోస్తున్నారని, ఆయన బూట్లు నాకుతున్నారని, ఇలా చేయడానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. తన కొడుకుకు టికెట్ ఇప్పించడం కోసం సుఖేందర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ పదవిని తాకట్టు పెట్టారని, ఇప్పుడు కొడుకు టికెట్ కోసం తన పదవిని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. వారిద్దరిని గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.