కోహ్లీకి ఏమైంది?

టీమ్ ఇండియా తరఫున విరాట్ కోహ్లి విజయవంతమైన కెప్టెన్. అతడి నాయకత్వంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. టెస్టుల్లో నంబర్ వన్ కూడా అయింది. కానీ ఐపీఎల్‌లో మాత్రం కోహ్లీ జట్టు అంటే అందరూ చాలా కామెడీగా చూస్తారు. ఐపీఎల్‌లో కెరీర్ ఆరంభం నుంచి కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా కెప్టెన్‌గా ఆ జట్టును నడిపిస్తున్నాడు.

ఐతే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ జట్టు కప్పు గెలవలేదు. గతంలో కోహ్లి నాయకత్వంలో రెండుసార్లు, కుంబ్లే నాయకత్వంలో ఒకసారి ఫైనల్ చేరినా కప్పు మాత్రం గెలవలేకపోయారు. ఐతే కొన్నేళ్లుగా ఆ జట్టు ప్రదర్శన పేలవం. ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోతోంది. పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కింది వరుసలో ఉంటోంది. ప్రతిసారీ ‘ఈసాలా కప్ నమదే’ అని బెంగళూరు అభిమానులు అనడం.. తీరా ఆ జట్లు ప్రదర్శన చూస్తే తీసికట్టుగా ఉండటం.. ఇదీ వరస.

ఎప్పట్లాగే ఈసారి కూడా బెంగళూరు అభిమానులు తమ జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తొలి మ్యాచ్‌లో కొంచెం కష్టపడి అయినా సరే.. సన్‌రైజర్స్ లాంటి బలమైన జట్టును ఓడించడంతో ఈసారి ఆర్సీబీ రాత మారుతోందని ఆశపడ్డారు. కానీ రెండో మ్యాచ్‌కు వచ్చేసరికి ఆ జట్టు ‘ఒరిజినల్ ఫామ్’ను అందుకుంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఘోరంగా ఆడి దాదాపు వంద పరుగుల తేడాతో పరాజయం పాలైంది. జట్టు ప్రదర్శనకు మించి కోహ్లి పెర్ఫామెన్స్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

తొలి మ్యాచ్‌లో ఫెయిలైతే.. ఒక మ్యాచ్‌ వైఫల్యమే కదా అనుకున్నారు. కానీ రెండో మ్యాచ్‌లో 200 పైచిలుకు లక్ష్యం ముందుండగా కోహ్లి పేలవంగా ఆడి ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అన్ని రకాలుగానూ విఫలమయ్యాడు. కెప్టెన్‌గా క్లూలెస్‌గా కనిపించాడు. రాహుల్‌ను ఆపడంలో తేలిపోయాడు. స్వయంగా అతను రాహుల్ ఇచ్చిన తేలికైన క్యాచ్‌లు రెండు వదిలేయడం అభిమానులకు పెద్ద షాక్. ఇంతకుముందు జట్టు ఫెయిలైనా కోహ్లి సక్సెస్ అయ్యేవాడు. కానీ ఈసారి రెండు మ్యాచ్‌ల్లోనూ విరాట్ పేలవ ప్రదర్శన చేయడం అభిమానులకు మింగుడుపడటం లేదు. అతడి మీద సోషల్ మీడియాలో బోలెడంత ట్రోలింగ్ జరుగుతోంది. మీమ్స్ ఓ రేంజిలో పేలుతున్నాయి.