రాజమౌళి గుర్తు చేసిన బాలు ప్రత్యేకత

భారత సంగీత ప్రియుల్ని విషాదంలో ముంచెత్తి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన మృతి పట్ల సినిమా వాళ్లే కాదు.. అందరూ తీవ్ర వేదనతో స్పందిస్తున్నారు. సెలబ్రెటీలందరూ తమ శోకాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందులో దర్శక ధీరుడు రాజమౌళి పెట్టిన ట్విట్టర్ మెసేజ్.. బాలు ప్రత్యేకతను తెలియజేస్తుంది.

‘‘బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు.

చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్ప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషలలోను పాడారు. అందరి చేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’.. ఇదీ ట్విట్టర్లో రాజమౌళి పెట్టిన పోస్టు.

రాజమౌళి తెలుగువాడే కానీ.. ఆయన పుట్టి పెరిగింది కర్ణాటకలో. కన్నడిగులతో మంచి సంబంధాలున్నాయి. బాలు తమ వాడని అక్కడి వాళ్లు ఎలా కొట్టాడేవాళ్లో రాజమౌళి తన ట్వీట్లో చెప్పుకొచ్చాడు. ఇలా కన్నడిగులు మాత్రమే కాదు.. తమిళులు కూడా బాలును ఓన్ చేసుకుంటారు. తమ వాడిగానే చూస్తారు. గౌరవిస్తారు. ఆయన కోసం కొట్లాటకు దిగుతారు.

బాలు అనారోగ్యం పాలైనప్పటి నుంచి తమిళులు ఎంతగా తల్లడిల్లిపోతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. వారి తపన చూసి ఉత్తరాది వారు బాలును తమిళుడిగానే భావిస్తున్నారు. ఒకప్పుడు హిందీలో బాలు పాడిన పాటలకు పరవశించిన అక్కడి ప్రేక్షకులు కూడా ఆయన్ని ఇలాగే ఓన్ చేసుకున్నారు.

ఏనాడూ కూడా పరభాషా గాయకుడు అనే భావన కలగకుండా ఆయా భాషల్లో అద్భుతంగా పాటలు పాడిన సింగర్ బాలు. ఒక రకంగా చెప్పాలంటే వేరే భాషల వాళ్లు బాలును గౌరవించినంతగా, ఆయన కోసం తపించినంతగా మన వాళ్లు గౌరవించరు, తపించరు అనిపిస్తుంది ఆయనపై వారి అభిమానం చూస్తే. బాలు చికిత్సకు సంబంధించిన ఖర్చులన్నీ తమిళనాడు ప్రభుత్వమే చూసుకుంటోందంటే వాళ్లకు ఆయనపై ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు.