అందుకే కదా చైనాను రోగ్ నేషన్ అనేది

ఇందుకే ప్రపంచదేశాల్లో చైనాకు రోగ్ నేషన్ అని పేరుపడిపోయింది. ఎక్కడవకాశాలుంటే అక్కడల్లా భూభాగాలను కబ్జా చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నది డ్రాగన్ దేశం. దశాబ్దాల క్రితం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకున్నది. ఆ తర్వాత పాకిస్ధాన్ భూముల్లో జెండాలు పాతింది. వ్యాపారం పేరుతో శ్రీలంకలో కూడా భూములను తీసుకుంది. తనకు ఇంతకాలం మద్దతుగా నిలబడ్డ నేపాల్ ను కూడా వదల్లేదు. నేపాల్ లోని భూభాగంలోకి చొచ్చుకుపోవటంతో అక్కడి జనాలు గగ్గోలు పెడుతున్నారు.

భారత్ తో జరిగిన యుద్ధంలో ఛైనా పై చేయి సాధించింది. అయితే యుద్ధం పేరుతో అప్పటికే సరిహద్దుల్లోని చాలా భూభాగాన్ని చైనా ఆక్రమించేసింది. ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి ఇవ్వమని మన ప్రభుత్వం అడిగినా ఇస్తానని చెప్పి చివరకు తన సరిహద్దుల్లో కలిపేసుకుంది. అప్పటి నుండి డ్రాగన్ దేశం సైన్యాలతో మనకు చాలా తలనొప్పులు వస్తునే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డ్రాగన్ సైన్యానికి మన సైన్యాలు గట్టిగా బుద్ధి చెబుతున్నాయి. చైనా ఆధీనంలో ఉండిపోయిన భూభాగాన్ని మన సైన్యాలు ఇఫ్పుడిప్పుడే తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి.

సరే ఈ విషయాన్ని పక్కనపెడితే పాకిస్ధాన్ కు సంవత్సరాల తరబడి మద్దతుగా నిలబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్ధాన్ చేస్తున్న పరోక్ష యుద్ధంలో చైనా బాగా సహకరిస్తోందనే ఆరోపణలు ఎప్పటినుండో వినిపిస్తున్నదే. మద్దతు మిషతో పాకిస్ధాన్ లోని వేలాది కిలోమీటర్లను సొంతం చేసేసుకున్నది. అలాగే వ్యాపార విస్తరణ సాకుతో శ్రీలంక భూభాగంలో కూడా ఈమధ్యనే పాగా వేసింది.

సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే భారత్ కు వ్యతిరేకంగా నేపాల్ ను కూడా చైనా బాగా దువ్వుతోంది. ఏకళనున్నదో కానీ నేపాల్ కూడా చైనా మద్దతుతోనే మనపైకి కాలు దువ్వుతోంది. దశాబ్దాల పాటు మిత్రదేశంగా ఉన్న నేపాల్ హఠాత్తుగా శతృదేశంగా మారిందంటే డ్రాగన్ చలవగానే అనుకోవాలి. మరి అలాంటి దేశం విషయంలో చైనా ఎలాగుండాలి ? కానీ ఎవరి విషయంలో అయినా ఒకటే విధానం అన్నట్లుగా తాజాగా నేపాల్ భూభాగాన్ని కూడా డ్రాగన్ కబ్జాలు మొదలు పెట్టింది.

టిబెట్ సరిహద్దుల్లోని నేపాల్ భూభాగంలో చైనా 11 అతిపెద్ద భవనాలను నిర్మించేసింది. హూమ్లా జిల్లాలోని లాంప్సా గ్రామంలో కొంత భాగాన్ని ఆక్రమించేసింది. ముందుగా సరిహద్దులను మార్చేసి తర్వాత భూభాగంలో జెండాలు పాతటం చైనా అవలంభించే విధానం. ఇక్కడ కూడా ఇదే చేసింది. చైనా కబ్జాలకు నిరసనగా నేపాల్ సరిహద్దుల్లోని ప్రజలు ఆందోళనలు మొదలుపెట్టారు. నేపాల్ జనాలు ఎంతగా అరచి గీపెట్టినా చైనా మాత్రం తన కబ్జా చేసిన ప్రాంతాన్ని వదులుకోదన్న విషయం నేపాల్ కు అనుభవపూర్వకంగా అర్ధమయ్యుంటుంది. చూడాలి తాజా కబ్జాలపై నేపాల్ పార్లమెంటు ఏ విధంగా స్పందిస్తుందో.