అదే తప్పును చంద్రబాబు రెండోసారి కూడా చేస్తున్నాడా ?

చంద్రబాబునాయుడు ఒకే తప్పును రెండోసారి కూడా చేస్తున్నారు. మొదటిసారి పార్టీలోని నేతలు వారించినా వినలేదు. దాని ఫలితాన్ని ఇపుడు అనుభవిస్తున్నారు. మళ్ళీ అదే తప్పును ఇపుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కాకపోతే మొదటిసారి తప్పు చేసినపుడు అధికారంలో ఉన్నారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారంతే. ఇంతకీ ఆ తప్పు ఏమిటంటే తిరుమలకు వెళ్ళబోతున్న జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోమని చంద్రబాబు పిలుపివ్వటమే. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు జగన్ బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం జరిగే గరుడోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

అందుకనే మధ్యాహ్నానికి జగన్ తిరుపతి చేరుకుని అలిపిరి గుండా తిరుమల చేరకుంటారు. ఈ సందర్భంలోనే జగన్ ను అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపిచ్చారు. అన్యమతస్తుడైన జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు గట్టిగా వాదన మొదలుపెట్టారు. జగన్ను అడ్డుకుని డిక్లరేషన్ ఇచ్చేట్లుగా పట్టుబట్టి ఒప్పించాలంటూ నేతలకు పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి కాదు ఇది చివరా కాదు.

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, జగన్ ఎన్నోసార్లు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎప్పుడు వైఎస్ కుటుంబం విషయంలో లేని ‘అన్యమతస్తులు’ అనే అభ్యంతరం ఇపుడే చంద్రబాబు ఎందుకు లేవదీస్తున్నట్లు ? అసలు ఇటువంటి అభ్యంతరాలు, మతపరమైన రాజకీయాలు చేయటం వల్ల చంద్రబాబుకు వచ్చే లాభం ఏమిటో అర్ధం కావటం లేదు. అనవసరంగా టిడిపి నేతలు అలిపిరి దగ్గర కాసేపు గోల చేస్తారు, పోలీసులు వాళ్ళని అరెస్టు చేసి తీసుకెళతారు. ఆ ఘటనలను మీడియా కొద్దిసేపు చూపుతుందంతే. కొద్దిసేపు మీడియా ప్రచారానికే చంద్రబాబు ఇటువంటి రాజకీయం చేయటమేంటో ?

గతంలో కూడా ఇటువంటి రాజకీయమే చంద్రబాబు చేశారు. స్వామివారి దర్శనం కోసం అప్పట్లో బిజెపి అధ్యక్షునిగా ఉన్న అమిత్ షా తిరుమలకు వచ్చినపుడు కూడా టిడిపి శ్రేణులు అడ్డుకుని నానా గోల చేశాయి. అమిత్ ప్రయాణిస్తున్న కారును అడ్డుుకన్నారు. ఈ క్రమంలో కొందరు అతివాదులు చెప్పులు, కర్రలు, రాళ్ళు వేసి గోల చేశారు. అది వేరే విషయం. అప్పుడు కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్సు పెట్టి మరీ తన నేతలను రెచ్చగొట్టారు. అమిత్ రాక సందర్భంగా నిరసనను తెలియజేయాలని ఆదేశించారు. దాంతో అప్పట్లో జరిగిన గొడవ జాతీయస్ధాయిలో చర్చకు దారితీసింది. అప్పుడంటే చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులు కాస్త శాంతియుతంగా ఉంటారు. కానీ ఇఫుడు అలా కాదుకదా. పోలీసులు నేతలపై కేసులు పెట్టి జైళ్ళలో పడేస్తే బాధ్యతెవరిది ?