బిగ్‍బాస్‍: ఎవరినీ టార్గెట్‍ చేయకండర్రా!

బిగ్‍బాస్‍ షోలో ఎప్పుడయినా కానీ ఒక కంటెస్టెంట్‍ని ఎవరయినా టార్గెట్‍ చేస్తున్నట్టు అనిపిస్తే ఇక బయట ప్రేక్షకులు అతడు లేదా ఆమె వెంట నిలబడిపోతారు. హౌస్‍లో వాళ్లకు సపోర్ట్ దక్కకపోతే బయటనుంచి తమ ఓట్లతో వాళ్లను గెలిపించేస్తుంటారు. ఒకే వ్యక్తిని టార్గెట్‍ చేయడం ఎంత తప్పు అనేది తెలుగు సీజన్‍ 2లోనే తెలిసి వచ్చి వుండాలి. ‘కౌశల్‍’ని అప్పటి హౌస్‍మేట్స్ అదే పనిగా టార్గెట్‍ చేయడం అతడిని విజేతగా నిలబెట్టింది. గత సీజన్లో అదే తప్పు శ్రీముఖి చేసింది. ప్రతి నామినేషన్లోను నిన్ను పెడతానంటూ రాహుల్‍ సిప్లిగంజ్‍ని టార్గెట్‍ చేస్తూ మాట్లాడేది. అది కాస్తా శ్రీముఖి విజయావకాశాలను దెబ్బ తీసింది.

అసలు ఎలాంటి గేమ్‍ ఆడకుండానే రాహుల్‍కి బిగ్‍బాస్‍ కిరీటం దక్కింది. ఇవన్నీ చూసి కూడా ఈ సీజన్లో బిగ్‍బాస్‍ హౌస్‍లో వున్న వాళ్లు తమకు తెలియకుండానే కుమార్‍ సాయిని టార్గెట్‍ చేస్తున్నారు. మొదట ఆడియన్స్ అది పట్టించుకోకపోయినా కానీ సోమవారం నామినేషన్‍ ఎపిసోడ్‍తో కుమార్‍ సాయికి ఒక్కసారిగా సింపతీ పెరిగిపోయింది.

చాలా మంది కలిసి ఒక్కడినే టార్గెట్‍ చేస్తున్నారంటూ అతడికి సింపతీ ఓట్లు మొదలైపోయాయి. దీనిని ఆదిలోనే కట్‍ చేయగలిగితే ఓకే కానీ ఈ తరహా ఎపిసోడ్లు మరో రెండు పడ్డాయంటే మాత్రం ఇక అంతే సంగతులు. అసలే మన తెలుగు ప్రేక్షకులు సెంటిమెంట్‍ కోసం ఏ ఎండ్‍కి అయినా వెళ్లిపోతారు.