బాలకృష్ణ సినిమా చేస్తోన్న ప్రభాస్‍?

ప్రభాస్‍తో నాగ్‍ అశ్విన్‍ ఒక అంతర్జాతీయ శ్రేణి సినిమా తలపెట్టిన సంగతి తెలిసిందే. అశ్విన్‍ ఒక్కసారి కథ చెప్పగానే వెంటనే చేసేస్తున్నా అని మాట ఇచ్చి సినిమా అనౌన్స్ చేసిన ప్రభాస్‍ ఈ చిత్రం తన పాన్‍ ఇండియా ఇమేజ్‍ని మరింత పటిష్టం చేస్తుందని నమ్ముతున్నాడు. నాగ్‍ అశ్విన్‍ తన సినిమాను పాన్‍ ఇండియా సినిమా అంటే ఒప్పుకోవడం లేదు.

ఇది పాన్‍ వరల్డ్ సినిమా అని, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్లు చూసి మెచ్చుకునేలా వుంటుందని అంటున్నాడు. ఇంతకీ ఈ సైన్స్ ఫిక్షన్‍ సినిమా టైమ్‍ మెషీన్‍ నేపథ్యంలో రూపొందనుందట. అంటే బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‍లో వచ్చిన క్లాసిక్‍ ‘ఆదిత్య 369’ తరహాలో వుంటుందన్నమాట. టైమ్‍ మెషీన్‍ కాన్సెప్ట్ కావడంతో సింగీతం శ్రీనివాసరావుని స్క్రిప్ట్ సలహాదారుగా అశ్విన్‍ పెట్టుకున్నాడట. నిజానికి సింగీతం ‘ఆదిత్య 999’ అంటూ బాలకృష్ణతో సీక్వెల్‍ చేద్దామని భావించినా అది కుదర్లేదు.

ఆ సినిమా కోసం పెట్టుకున్న ఐడియాలు అశ్విన్‍తో షేర్‍ చేసుకుంటున్నారు కావచ్చు. ప్రపంచ స్థాయి గ్రాఫిక్స్తో ఫ్యూచరిస్టిక్‍ సినిమా ఎలా వుంటుందో నాగ్‍ అశ్విన్‍ ఈ సినిమాతో చూపించబోతున్నాడట. ఇందులో కథానాయికగా దీపిక పడుకోన్‍ నటించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా షూటింగ్‍ మొదలవుతుంది.