అచ్చెన్న చేతికి ఏపీ టీడీపీ, 27న కార్యవర్గం !

మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో అయినా ఏపిలో తెలుగుదేశంపార్టీ పరుగులు పెడుతుందా ? ఎందుకంటే అచ్చెన్నను ఏపికి చంద్రబాబునాయుడు అధ్యక్షునిగా నియమించారు. 27 న అధికారికంగా ప్రకటిస్తారు. అచ్చెన్న నియామకంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బాగా దూకుడు స్వభావం ఉన్న అచ్చెన్నను అధ్యక్షునిగా చంద్రబాబు అంగీకరిస్తారా ? అనే చర్చ కూడా జరిగింది. అయితే ఇఎస్ఐ కుంభకోణంలో అరెస్టవ్వటం అందులోను ఈయన బిసి కావటం వల్ల మాజీమంత్రికే అధ్యక్షపదవి ఖాయమని తేలిపోయింది.

సరే తెరవెనుక ఏమి జరిగినా మొత్తానికి అచ్చెన్నను ఏపికి అధ్యక్షునిగా నియమించారు. మరో వారం రోజుల్లో కార్యవర్గాన్ని నియమిస్తారని సమాచారం. నిన్నటి వరకు అధ్యక్షునిగా ఉన్న మరో మాజీమంత్రి కిమిడి కళా వెంకటరావు ప్రభావం ఎక్కడా కనబడలేదు. మామూలుగానే కిమిడి చాలా మెతకమనిషి. దాంతోపాటు జిల్లాలో కాదు కదా కనీసం నియోజకవర్గంలో కూడా పట్టు సాధించలేకపోయారు. ఇటువంటి మనిషిని చంద్రబాబు ఇంతకాలం అధ్యక్షునిగా కంటిన్యు చేయటమే విచిత్రం.

దీని ప్రభావం మొత్తం రాష్ట్రపార్టీ పైన పడిందని కొందరు నేతలు చెబుతున్నా అందులో అసత్యమే ఎక్కువ. ఎందుకంటే జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొడుకు నారా లోకేష్ ఉన్నపుడు అధ్యక్షునిగా ఎవరున్నా అయితే, ప్లస్ అవ్వాలి గాని మైనస్ అయ్యే అవకాశాలు తక్కువ. ఇలాంటి నేపధ్యంలో కళా ప్రభావం కూడా పార్టీపై అంతంత మాత్రంగానే ఉండటంలో ఆశ్చర్యంలేదు.

మరి ఈ నేపథ్యంలో కొత్తగా నియమితుడైన అచ్చెన్న పార్టీని ఏ విధంగా పరుగులు పెట్టించగలడో చూడాలి ? కిమిడికి అచ్చెన్నకు ప్రధాన తేడా ఏమిటంటే దూకుడు. వ్యవహార శైలిలో కళా వెంకట్రావుకు అచ్చెన్నకు చాలా తేడా ఉంది. ఏ విషయంలో అయినా అచ్చెన్న చాలా దూకుడుగా ఉంటారు. కాబట్టి పార్టీని నడింపించటంలో అచ్చెన్నకు చంద్రబాబు గనుక స్వంతంత్రం ఇస్తే అప్పుడు కొత్త అధ్యక్షుని సామర్ధ్యం ఏమిటో తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై ఆయనకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారట.