జ‌న‌సేన‌కు స‌క్సెస్ ఇవ్వ‌ని వైట్ కాల‌ర్ పాలిటిక్స్‌

పాలిటిక్స్ అంటేనే.. ఏ రోజుకు ఆరోజు ఉన్న ప‌రిస్థితులకు అనుగుణంగా మార్పులు తెచ్చుకుని ముందుకు సాగే ప్ర‌ధాన ప్ర‌క్రియ‌. అలాంటి రాజ‌కీయాల్లో నేత‌ల‌కు ఉండాల్సింది.. దూకుడు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లే చొర‌వ! పైగా మారుతున్న నేటి రోజుల్లో మారుతున్న వ్యూహాల‌కు అనుగుణంగా.. రాజ‌కీయాల్లో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

గ‌తంలో పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య వంటి వారు చేసిన రాజ‌కీయాలు చేస్తామంటే.. వినేవారు.. క‌నేవారు కూడా నేడు క‌రువ‌య్యారు. అంతా సంచ‌ల‌న‌మే.. అన్నిటా సంచ‌ల‌న‌మే. ఒక‌టని రెండ‌నిపించుకునే నాయ‌కులకు, పార్టీల‌కు ఉండే ఫాలోయింగ్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

మ‌రి ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని మూడు ప్ర‌ధాన పార్టీలు దూకుడుగానే ఉన్నాయ‌ని చెప్పాలి. వైసీపీ, టీడీపీ, బీజేపీలు మూడూ కూడా దూకుడు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు. ఇక‌, టీడీపీ వైసీపీలైతే.. నువ్వా-నేనా అనే రాజ‌కీయాలు, సంచ‌ల‌నాలు.. వంటివి వాటికి ష‌రా మామూలే. రాజ‌కీయాల్లో ఇలాంటి దూకుడు అవ‌స‌ర‌మా? అంటే.. ప్ర‌జ‌లు ఇలాంటి రాజ‌కీయాల‌కే విలువ ఇస్తున్న‌ప్పుడు.. దూకుడుగా ఉన్న నేత‌ల‌కే ఓట్లు వేస్తున్న‌ప్పుడు.. పార్టీలు కూడా ఆత‌ర‌హా మార్పులు చేసుకోవ‌డం అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఇక‌, ఈ కోవ‌లో ప్ర‌శ్నిస్తానంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన దూకుడు ఎలా ఉంది? అంటే.. కేవ‌లం ఆయ‌న ఒక్క‌డే.. అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని ఆక‌ట్టుకునే నేత‌గా మిగిలారు.

ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెడితే.. జ‌నాన్ని ఆక‌ట్టుకునేలా.. పార్టీ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకుని వెళ్లేలా.. ప్ర‌భుత్వంలోని పార్టీకి కానీ, ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న ఇత‌ర పార్టీల‌కు కానీ కౌంట‌ర్లు ఇచ్చే రేంజ్‌లో.. మాస్‌ను ఆక‌ట్టుకునే స్థాయిలో ప‌ట్టుమ‌ని న‌లుగురు కూడా క‌నిపించ‌డం లేదు. నాయ‌కులు ఉన్నా కూడా వారంతా.. వైట్ కాల‌ర్ నాయ‌కులే. వారిలో దూకుడు ఉండ‌దు. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్దామ‌నే ఆలోచ‌నా లేదు. ఎదుటి పార్టీ నేత‌లు చేసే విమ‌ర్శ‌ల‌కు అంతే దీటుగా కౌంట‌ర్ ఇచ్చే పొజిష‌నూ లేదు. పైగా పార్టీ త‌ర‌ఫున గ‌ట్టిగా వాయిస్ కూడా వినిపించ‌లేక పోతున్నారు.

ఫ‌లితంగా మాస్ ను ఆక‌ట్టుకునే నేత‌లు ఒక్క‌రంటే ఒక్క‌రూ క‌నిపించ‌డం లేదు. కానీ, నేటి రాజ‌కీయాల్లో మాస్ ఫాలోయింగ్ అత్యంత కీల‌కం. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు జ‌న‌సేన‌కు మాస్ నేత‌లు కావాల‌నే డిమాండ్లు క్షేత్ర‌స్థాయిలో వినిపిస్తున్నాయి. మ‌రి ప‌వ‌న్ ఆదిశ‌గా నేత‌ల‌ను త‌యారు చేస్తారో లేదో చూడాలి.