కేటీఆర్‌ షాక్‌… టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైండ్ బ్లాంక్‌

రాజ‌కీయాల్లో కొన్ని సార్లు ఎక్క‌డి నుంచో మ‌రెక్క‌డికో ఎత్తుగ‌డ‌లు క‌నెక్ట్ అవుతుంటాయి. తాజాగా తెలంగాణ‌లో రెండో అతిపెద్ద న‌గ‌రం అనే గుర్తింపు పొందిన న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌లో ఇదే జ‌రిగింది. జిల్లాకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు చెందిన క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కూల్చి వేశారు. వ‌రంగల్‌లో ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వరంగల్‌లో వరదల సంభవించిన సమయంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. హన్మకొండ హంటర్ రోడ్డులోని వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగగా నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలే కారణమని గుర్తించారు. ఇందులో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం కూడా ఉన్నట్లు ఇటీవల తేల్చారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.

నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయ‌డం, వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వ‌డంతో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్‌ పమేలా సత్పతి ఆదేశాలతో డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్మాణాన్ని పాక్షికంగా తొలగించారు. కాగా, నాలా విస్తరణ కోసం కార్యాలయ భవనాన్ని తొలగించడానికి ఎమ్మెల్యే అరూరి రమేష్‌ స్వచ్ఛందంగా ముందుకు వ‌చ్చారని ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇదిలాఉండ‌గా, వరంగల్‌ నగరంలోని నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, ప్రహారీల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం భద్రకాళి, ములుగు రోడ్డు, నయీంనగర్‌ నాలాలపై ఉన్న 22 ఆక్రమణలను బల్దియా సిబ్బంది తొలగించారు. ఇప్పటి వరకు 88 ఆక్రమణలు కూల్చివేసినట్లు ఏసీపీలు ప్రకాశ్‌ రెడ్డి, సాంబయ్య తెలిపారు.

ఇదిలుఉండ‌గా, నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారా? అని మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్‌ మేయర్‌, కమిషనర్‌ను అడిగారు. హైదరాబాద్‌ నుంచి పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌తో కలిసి మేయర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రశ్నకు సమాధానంగా మేయర్‌ మాట్లాడుతూ, నగరంలో 324 నిర్మాణాలు నాలాలపై ఉన్నట్లు గుర్తించి వాటిలో 68 తొలగించామని మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని వంద శాతం ఆక్రమణలను తొలగిస్తామని వెల్ల‌డించారు.