అంతా కేసీయారే చేశారా ?

తెలంగాణాకు జరిగిన, జరుగుతున్న ప్రతి నష్టానికి కేసీయార్ మాత్రమే బాధ్యత వహించాలా ? అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి. మొత్తం అంతా కేసీయారే చేశారు కాబట్టి బాధ్యత తీసుకోవాల్సింది కూడా మాజీ ముఖ్యమంత్రే అని రేవంత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నీటి యాజమాన్య వ్యవహారాలపై జరిగిన సమీక్షలో రేవంత్ మాట్లాడుతు విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరి నదీ జనాల యాజమాన్య బాధ్యతలను కేంద్రప్రభుత్వానికి అప్పగించినట్లు చెప్పారు. నీటి యాజమాన్య బాధ్యతల్లో సమస్యలు వచ్చినపుడు బాధ్యతలను కేంద్రానికి అప్పగించాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా కేసీయార్ పట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల తెలంగాణాకు తీరని నష్టం వస్తోందని కేటీయార్, హరీష్ రావులు గోలచేయటంలో అర్ధంలేదన్నారు. జలదోపిడి మొత్తం కేసీయార్ హయాంలోనే జరిగిందన్నారు. ఏపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న కేసీయార్ తెలంగాణాపై దెబ్బపడుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలో తెలంగాణాకు కేసీయార్ హయాంలోనే తీరని నష్టం జరిగిందని రెచ్చిపోయారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలు 60 శాతం తెలంగాణాలోనే ఉంటే నీటివాట 299 టీఎంసీలు మాత్రమే ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు.

నదీ పరివాహక ప్రాంతం 40 శాతం మాత్రమే ఉన్న ఏపీ నీటివాటాలో 512 టీఎంసీలు ఎలా వాడుకుంటోందని రేవంత్ ప్రశ్నించారు. అనుమతులు లేని ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోలేని కేసీయార్, హరీష్ ఇపుడు తమ ప్రభుత్వం వల్ల తెలంగాణాకు నష్టాలు జరుగుతోందని గోలచేస్తుండటాన్ని రేవంత్ తప్పుపట్టారు. కృష్ణానదిపై 15 ప్రాజెక్టుల యాజమాన్యాన్ని కృష్ణా, గోదావరి(కేఆర్ఎంబీ)కి అప్పగిస్తామని 2022 మే 27వ తేదీన కేసీయార్ నిర్ణయం తీసుకున్నది వాస్తవమే కదా అని రేవంత్ నిలదీశారు.

అధికారంలో ఉన్న పదేళ్ళల్లో తెలంగాణాకు అన్ని రంగాల్లో చేయాల్సిన నష్టం చేసేసి ఇపుడు తమ ప్రభుత్వందే బాధ్యతని రివర్సులో గోలచేస్తే కుదరదని వార్నింగిచ్చారు. కేసీయార్ హయాంలో జరిగిన ప్రతి నష్టాన్ని జనాలకు వివరించటం తమ ప్రభుత్వ బాధ్యత అన్నారు. కేసీయార్ కుటుంబం వల్ల తెలంగాణాలో జరిగిన దోపిడీ, జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తామని రేవంత్ స్పష్టంగా ప్రకటించారు. చేసిన పాపాల నుండి ఎవరు తప్పించుకోలేరని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.